తెలంగాణ

telangana

Bio Asia Summit 2023 ఫిబ్రవరి 24 నుంచి హైదరాబాద్​లో బయో ఆసియా సదస్సు

By

Published : Aug 24, 2022, 6:45 AM IST

KTR

Bio Asia Summit 2023 in Hyderabad హైదరాబాద్‌ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మూడ్రోజుల పాటు బయో ఆసియా సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సదస్సు లోగో, థీమ్​లను ఆవిష్కరించారు. మానవీయ ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహించనున్నామని కేటీఆర్ తెలిపారు.

Bio Asia Summit 2023 in Hyderabad: బయో ఆసియా 20వ అంతర్జాతీయ సదస్సు-2023 వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ‘మానవీయ ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం’ నినాదంతో ఈ సదస్సును నిర్వహించబోతున్నామని అన్నారు. ఈసారి 120 దేశాల నుంచి ప్రభుత్వ ప్రముఖులు, పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, నోబెల్‌ పురస్కార విజేతలు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో 20వ బయోఆసియా సదస్సు నిర్వహణ తేదీలను ప్రకటించారు. లోగో, థీమ్‌లను కేటీఆర్​ విడుదల చేశారు.

రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌ దేశ ఆరోగ్యసంరక్షణ, జీవశాస్త్రాల హబ్‌గానే గాక ప్రపంచ రాజధానిగా ఎదిగిందని కేటీఆర్ అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో టీకాలను రూపొందించి సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. బయోఆసియా సదస్సుకు హైదరాబాద్‌ శాశ్వత వేదిక కావడం ద్వారా తెలంగాణకు ఎనలేని మేలు జరిగిందని చెప్పారు. భారీగా పెట్టుబడులకు మార్గదర్శిగానేగాక గొప్ప పరిశోధనలు, ఆవిష్కరణలకు ఉపకరించింది. ఒక అంతర్జాతీయ సదస్సును 20 సంవత్సరాల పాటు నిర్వహించడం అరుదైన ఘనత అని పేర్కొన్నారు.

దీనిని హైదరాబాద్‌ సొంతం చేసుకుందని తెలిపారు. 2022లో దృశ్యమాధ్యమంలో నిర్వహించిన సదస్సులో 70 దేశాల నుంచి దాదాపు 37,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సారి ప్రత్యక్షంగా సదస్సు జరుగుతుందని అన్నారు. ఆరోగ్యరంగానికి డేటా అనలిటిక్స్‌, కృత్రిమ మేధ, బ్లాక్‌చెయిన్‌ వంటి నవీన సాంకేతికతను జత చేసి.. అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా సదస్సు సాగుతుందని పేర్కొన్నారు.

కరోనా తదితర వ్యాధులపై మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ శాస్త్రవేత్తలకు జీనోమ్‌వ్యాలీ పురస్కారాలను అందిస్తాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తినాగప్పన్‌లు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని గవర్నర్​కు భాజపా ఫిర్యాదు

ఉచితాలపై భాజపా సహా అన్ని పార్టీలూ ఒకేవైపు, అందుకే మేమే తేలుస్తాం

ABOUT THE AUTHOR

...view details