తెలంగాణ

telangana

అధికారిక లాంఛనాలతో నేడు కృష్ణంరాజు అంత్యక్రియలు

By

Published : Sep 12, 2022, 7:28 AM IST

Updated : Sep 12, 2022, 9:36 AM IST

కృష్ణంరాజు కన్నుమూత.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Actor Krishnamraju Passed away: సినీ దిగ్గజం, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు చలనచిత్ర ప్రముఖులు తరలివచ్చారు. కృష్ణంరాజు భౌతికకాయానికి కన్నీటి నివాళి అర్పించారు. రెబల్ స్టార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లారు. కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రసీమకే కాకుండా భారత సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించిన ప్రముఖులు.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవాళ అంతిమయాత్ర అనంతరం మొయినాబాద్‌ మండలం కనకమామిడిలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

‘కన్నప్ప’ కన్నుమూత.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Actor Krishnamraju Passed away: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటల సమయంలో తుదిశ్వాస విడిశారు. కొంతకాలంగా మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (సీవోపీడీ)తోపాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏడాది కిందట మధుమేహం కారణంగా ఆయన పాదం కూడా తొలగించారు. ఇటీవల కొవిడ్‌ సోకడంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కోలుకొని ఇంటికి చేరుకున్నా.. పోస్టు కొవిడ్‌ సమస్యలు తలెత్తాయి. ఆగస్టు 5న తీవ్ర ఆయాసంతో మళ్లీ ఏఐజీలో చేరారు. గత 27 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

కరోనరీ హార్ట్‌ డిసీజ్‌, క్రానిక్‌ హార్ట్‌ రిథమ్‌ డిజార్డర్‌, పంపింగ్‌ ఒకదాని వెనుక ఒకటి ఆయనపై కోలుకోలేని విధంగా దాడి చేశాయి. బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లతో తీవ్ర న్యుమోనియా కూడా రావడంతో శనివారం రాత్రి నుంచి ఆరోగ్యం మరింత విషమించింది. మూత్రపిండాల పనితీరు పూర్తిగా దిగజారింది. చివరికి కార్డియాక్‌ అరెస్టుకు గురయ్యారు. వైద్యులు సీపీఆర్‌ ప్రక్రియతో కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కృష్ణంరాజు మృతికి ప్రధాని మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌ సహా పలువురు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సోమవారం నిర్వహించనున్నారు.

రైతు కుటుంబం నుంచి..:1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. తండ్రి ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు రైతు. తల్లి లక్ష్మీనర్సాయమ్మ గృహిణి. కృష్ణంరాజుకు ఇద్దరు అక్కలు, నలుగురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. మొదటి భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. శ్యామలాదేవిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడే ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌. కృష్ణంరాజు ఆరో తరగతి వరకు మొగల్తూరులో చదివారు. నరసాపురంలోని టేలరు ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, వైఎన్‌ కళాశాలలో పీయూసీ, హైదరాబాద్‌లోని బద్రుకా కళాశాలలో బీకాం పూర్తిచేశారు. డిగ్రీ చదివే సమయంలోనే అబిడ్స్‌లో ఓ స్టూడియో నిర్వహించేవారు. తర్వాత గాంధేయవాది పత్తేపురం మూర్తిరాజు నడిపిన ‘రత్నప్రభ’ దినపత్రిక నిర్వహణ బాధ్యతలు చూశారు. మూర్తిరాజుకు చెందిన కొల్లేరు ఫుడ్‌ప్రొడక్ట్స్‌కు హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేశారు. తర్వాత సినిమాలపై మక్కువతో మద్రాసుకు పయనమయ్యారు.

కేంద్రమంత్రిగా..:నటుడిగా, నిర్మాతగా రాణిస్తూనే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు కృష్ణంరాజు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన... 1991లో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత భారతీయ జనతాపార్టీలో చేరారు. 1998లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1999 మధ్యంతర ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2009లో భాజపాను వీడి.. ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మళ్లీ భాజపాలో చేరి కొనసాగారు.

నేడు అంత్యక్రియలు..:కృష్ణంరాజు మృతిపట్ల చిత్రసీమలో విషాదం నెలకొంది. సినీ కార్యక్రమాలు, వేడుకలు రద్దయ్యాయి. అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద ఉంచారు. పలువురు అభిమానులు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చారు. సోమవారం అంతిమయాత్ర అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కనకమామిడిలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఐదేళ్ల కిందట కొనుగోలు చేసిన కృష్ణంరాజు అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని నిర్మిస్తున్నారు. అది పూర్తికాక ముందే ఆయన అసువులు బాశారు. ఆయన మృతితో భార్య శ్యామల, కుమార్తెలు, ప్రభాస్‌, ఇతర కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి, మంచు విష్ణు, శివబాలాజీ, సీపీఐ నేత నారాయణ తదితరులు ఏఐజీ ఆసుపత్రికి చేరుకొని నివాళులర్పించారు.

ప్రముఖుల నివాళి..:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, రఘురామకృష్ణరాజు, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కాంగ్రెస్‌ నేత హనుమంతరావు, సినీ ప్రముఖులు కృష్ణ, మురళీమోహన్‌, చిరంజీవి, మోహన్‌బాబు, వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, సుమన్‌, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌, ప్రశాంత్‌నీల్‌, రాజుసుందరం, బీవీఎస్‌ ప్రసాద్‌ తదితరులు కృష్ణంరాజు ఇంటికి చేరుకొని నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, భాజపా ఎంపీ కె.లక్ష్మణ్‌, తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కవిత, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.

మొగల్తూరు.. కన్నీరు..:వెండితెరతో పాటు రాజకీయ రంగంలోనూ రాణించి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు పేరు తెచ్చిన ఉప్పలపాటి కృష్ణంరాజు మరణవార్తను విన్న మొగల్తూరు ప్రాంత ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ద్వారపూడి - కడియం గ్రామాల మధ్య ఉన్న జి.యర్రంపాలెం నుంచి సుమారు వందేళ్ల కిందట కృష్ణంరాజు పూర్వీకులు మొగల్తూరు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడి రాజబహుదూర్‌ కోట సంస్థానానికి చెందిన రాజులతో కృష్ణంరాజు కుటుంబానికి ముందు తరం నుంచీ బంధుత్వం ఉంది. ఆ సంస్థానానికి చెందిన దత్తుడు రాజు మొగల్తూరు సర్పంచిగా ఉండే సమయంలో కృష్ణంరాజు కొంతకాలం ఆయనకు సహాయకుడిగా ఉన్నారు.

ప్రధాని సంతాపం..:కృష్ణంరాజు మరణం తనను కలిచివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. నటుడిగా, రాజకీయ నాయకునిగా ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఆయన నా ఆప్తమిత్రుడు..:కృష్ణంరాజు తనకు ఆప్తమిత్రుడని సీఎం కేసీఆర్‌ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సీఎస్‌ ఏర్పాట్లు చేపట్టారు.

నైతిక విలువలకు కట్టుబడి జీవించారు..:‘తెలుగు ప్రజల హృదయాల్లో కృష్ణంరాజు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నైతిక విలువలతో జీవించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అనేక విషయాలపై మేం చర్చించుకున్నాం. ఇటీవల కృష్ణంరాజు ప్రధాని మోదీని కలిశారు. సినీ పరిశ్రమకు, భాజపాకు ఆయన మరణం తీరని లోటు’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర..:కృష్ణంరాజు మృతి వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన తన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అందరితో కలివిడిగా ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

‘చిలకా గోరింకా’తో తెరంగేట్రం..:తెలుగు నాట ‘భక్తకన్నప్ప’ అనగానే గుర్తుకొచ్చే పేరు... కృష్ణంరాజు. రౌద్ర ప్రధాన పాత్రలకు ఆయన చిరునామాగా మారారు. అభినయం, సంభాషణలు పలకడంలో తనదైన శైలిలో 183కి పైగా సినిమాల్లో నటించారు. 1966లో ‘చిలకా గోరింకా’తో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడిగా, తర్వాత కథానాయకుడిగా ప్రేక్షకులను మెప్పించారు. రెబల్‌స్టార్‌గా తనదైన ముద్ర వేశారు. కృష్ణవేణి, బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, భక్తకన్నప్ప, అమరదీపం, మనవూరి పాండవులు, రంగూన్‌ రౌడీ, సీతారాములు, త్రిశూలం, ధర్మాత్ముడు, అంతిమ తీర్పు తదితర సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. బావ బావమరిది, పల్నాటి పౌరుషం, మా నాన్నకి పెళ్లి తదితర సినిమాల్లోనూ నటవైవిధ్యాన్ని ప్రదర్శించారు. కన్నడంలోనూ నటించిన కృష్ణంరాజు సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలతో తన సత్తాను చాటారు. చివరిగా ‘రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌తో కలిసి నటించారు. అంతకుముందు ప్రభాస్‌తో ‘బిల్లా’, ‘రెబల్‌’ సినిమాల్లోనూ తెరను పంచుకున్నారు. తన సోదరుడు సూర్యనారాయణరాజుతో కలిసి గోపీకృష్ణ మూవీస్‌ పతాకంపై పలు చిత్రాలు నిర్మించారు.

‘నంది’ అందుకున్న తొలి ఉత్తమ నటుడు..:అమరదీపం, బొబ్బిలిబ్రహ్మన్న చిత్రాలకు కృష్ణంరాజు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు పొందారు. ‘నంది’ అందుకున్న తొలి ఉత్తమ నటుడు ఆయనే కావడం విశేషం. ఉత్తమ సహ నటుడిగా జైలర్‌గారబ్బాయి చిత్రానికీ నంది అందుకున్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారం పొందారు. కృష్ణవేణి, భక్తకన్నప్ప, తాండ్రపాపారాయుడు, బిల్లాతోపాటు ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన రాధేశ్యామ్‌ వరకు పలు చిత్రాలు ఆయన సొంత సంస్థ గోపీకృష్ణ మూవీస్‌ నిర్మించినవే. పుస్తక పఠనంపై ఆసక్తి మెండుగా ఉన్న కృష్ణంరాజు దర్శకత్వం కూడా చేయాలని ‘ఒక్క అడుగు’ పేరుతో ఓ కథ సిద్ధం చేసుకున్నారు. భక్తకన్నప్ప సినిమాను ప్రభాస్‌ కథానాయకుడిగా తానే రీమేక్‌ చేయాలని ఉందని కూడా చెప్పేవారు. ప్రభాస్‌ తెరంగేట్రం చేసి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల కృష్ణంరాజు మాట్లాడుతూ ‘20 ఏళ్లకి ప్రభాస్‌ 20 దేశాల్లో హీరో అయ్యాడు. ఆదిపురుష్‌ సినిమా హాలీవుడ్‌ సినిమాగా విడుదలవుతోంది’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రజల మనసుల్లో నిలిచిన గొప్ప నటుడు..:

తన విలక్షణ నటనతో కృష్ణంరాజు ప్రజల మనసుల్లో నిలిచారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆయన మృతి బాధాకరమని ట్వీట్‌ చేశారు. నటుడిగానే కాక కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు చేసిన సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రాజకీయాల్లోనూ తనదైన ముద్ర..: సినిమాల్లో హీరోగా రాణిస్తున్నప్పుడే కృష్ణంరాజుకు రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. పుట్టిపెరిగిన ప్రాంతం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలని ఆయన ఆకాంక్షించేవారు. వారిది కాంగ్రెస్‌ను అభిమానించే కుటుంబం కావడంతో... ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఆ పార్టీ ద్వారానే జరిగింది. కృష్ణంరాజు 1991లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి భూపతిరాజు విజయకుమార్‌రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చట్టసభలకు వెళ్లాలన్న బలమైన ఆకాంక్ష ఆయనలో చల్లారలేదు. 1998లో భాజపాలో చేరి, ఆ పార్టీ టికెట్‌పై కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 1999లో తెదేపా, భాజపా మిత్రపక్షం అభ్యర్థిగా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 1,65,948 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. లోక్‌సభలో భాజపా పార్లమెంటరీ పార్టీ విప్‌గా పని చేశారు. ఆర్థిక, ఎంపీ ల్యాడ్స్‌పై పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. 2000 సంవత్సరంలో వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖకు సంబంధించిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది సెప్టెంబరు 30న అప్పటి వాజ్‌పేయీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొన్నాళ్లు రక్షణ, వినియోగదారుల వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధిశాఖల సహాయ మంత్రిగానూ పని చేశారు. ఎంపీగా పదవీకాలం ముగిశాక... క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక దానిలో చేరారు. 2009లో రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ భాజపాలో చేరి ఆ పార్టీలోనే కొనసాగారు.

క్రీడలపై ప్రత్యేక ఆసక్తి..!కృష్ణంరాజు చదువుకునే రోజుల్లో కబడ్డీ, వాలీబాల్‌ ఆడేవారు. ఆయన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. అంతర్‌ కళాశాలల స్థాయిలో మంచి వాలీబాల్‌ క్రీడాకారుడిగా ఆయనకు పేరుండేది. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి కృష్ణంరాజు ప్రత్యేక కృషి చేశారని.. ఎంపీగా, మంత్రిగా ఆయన హయాంలో జిల్లాలో సుమారు రూ.600 కోట్ల విలువైన పనులు చేయించారని స్థానిక భాజపా నాయకులు చెబుతున్నారు.

ఇవీ చూడండి..:

కృష్ణంరాజు మొత్తం ఆస్తి విలువ అన్ని కోట్లా?

ఎన్టీఆర్​ను అలా చూడటమంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టమట

ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకు అదొక్కటే అసంతృప్తి.. ఆ కల నెరవేరకుండానే..

Last Updated :Sep 12, 2022, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details