Bharat Bandh Today:దేశవ్యాప్త రెండు రోజుల కార్మిక సమ్మెలో భాగంగా రాష్ట్రంలో.. కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హైదరాబాద్లో ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. 32లక్షల కోట్ల నికర ఆస్తులున్న జీవితాబీమా సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రచేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. కుత్భుల్లాపూర్లో జరిగిన సమ్మెకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంఘీభావం తెలిపారు. సంగారెడ్డి పటాన్చెరులో రాస్తారోకో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. జహీరాబాద్లో కార్మికులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. బోరబండలో జీహెచ్ఎంసీ సిబ్బంది ర్యాలీ చేశారు. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బోసిపోయిన సింగరేణి..: కార్మికుల సమ్మెతో సింగరేణిలో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. అత్యవసర సిబ్బంది మినహా కార్మికులెవరూ విధులకు హాజరుకాలేదు. భూపాలపల్లి, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం ఏరియాల్లో సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ జరగనివ్వబోమని కార్మికులు స్పష్టం చేశారు. సమ్మెతో సింగరేణి వ్యాప్తంగా సుమారు 32కోట్ల నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.