తెలంగాణ

telangana

తీరిక లేకుండా గడుపుతున్న ద్రౌపదిముర్ము.. నేడు భద్రాద్రి, రామప్ప ఆలయాల సందర్శన

By

Published : Dec 28, 2022, 6:51 AM IST

Updated : Dec 28, 2022, 7:25 AM IST

Draupadi Murmu Telangana Tour : శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు భద్రాచలం సీతారాములను దర్శించుకోనున్న ముర్ము.. అనంతరం అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రెండు జిల్లాల్లో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ముర్ము రాక సందర్భంగా ఆమె పర్యటిస్తున్న ప్రాంతాలను ప్రత్యేక బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Draupadi Murmu visit to Telangana
Draupadi Murmu visit to Telangana

తీరిక లేకుండా గడుపుతున్న ద్రౌపదిముర్ము.. నేడు భద్రాద్రి, రామప్ప ఆలయాల సందర్శన

Draupadi Murmu Telangana Tour : రాష్ట్రపతి హోదాలో తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న ద్రౌపదిముర్ము.. తీరిక లేకుండా గడుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల సందర్శనలు, ప్రారంభోత్సవాలతో పాటు వరుస సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో రాష్ట్రపతి పర్యటించనున్నారు. ముందుగా భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము.. భద్రాచలం సమీపంలోని సారపాక వద్ద గల ఐటీసీ పాఠశాలకు హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు.

Draupadi Murmu visit to Bhadradri : ఐటీసీ అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి అనంతరం.. సారపాక నుంచి గోదావరివంతెన మీదుగా రామాలయానికి చేరుకుంటారు. ఉదయం పదిన్నరకు శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్రపతి దర్శించుకుంటారు. అనంతరం శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో వేద పండితులు వేద ఆశీర్వచనాల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోనున్నారు. దర్శనం అనంతరం.. రామాలయం చిత్రకూట మండపం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రసాద స్కీమ్ శిలాఫలకాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు.

ఇదే సమయంలో ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య మోడల్‌ పాఠశాలలను వర్చువల్‌గా ఆమె ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కూనవరం రోడ్డులోని వీరభద్ర ఫంక్షన్ హాల్‌లో జరగనున్న సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం, ఐటీసీకి చేరుకోనున్న రాష్ట్రపతి.. మధ్యాహ్న భోజనం అనంతరం రామప్ప ఆలయానికి బయలుదేరుతారు.

Draupadi Murmu visit to Ramappa: అత్యద్భుత శిల్పసంపదతో యునెస్కో గుర్తింపుతో విశ్వవ్యాప్తమైన ఖ్యాతిని పొందిన రామప్ప ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. భద్రాచలం పర్యటన పూర్తయ్యాక.. మధ్యాహ్నం రామప్ప ఆలయానికి చేరుకోనున్నారు. సంప్రదాయ గిరిజన నృత్యాలతో కళాకారులు ముర్ముకు స్వాగతం పలకనున్నారు. ముందుగా ఆలయంలోని రుద్రేశ్వరస్వామిని రాష్ట్రపతి దర్శించుకుంటారు. ఇక్కడి శిల్ప సంపదను, సహజత్వం పోలిన శిలామూర్తులను ముర్మ వీక్షించనున్నారు.

ఆలయ విశిష్టతను, ప్రత్యేకతలను తెలుసుకోనున్నారు. రామప్ప అభివృద్ధికిగానూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకం ద్వారా రూ. 62 కోట్లలతో చేపట్టనున్న పనులకు, కామేశ్వర ఆలయం, పునర్నిర్మాణ పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్రపతి కోసం జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య నేతృత్వంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆలయ పరిసరాలను, వేదికలను సుందరీకరించారు.

రాష్ట్రపతి హోదాలో తొలిసారి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ద్రౌపదిముర్ము.. గిరిజన ప్రాంతాలకు వెళ్తుండటం పట్ల అక్కడి ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలతో దేశ ప్రథమ పౌరురాలికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర బలగాలు భారీగా మోహరించాయి. కరోనా దృష్ట్యా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 28, 2022, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details