తెలంగాణ

telangana

పోడు రైతుల బతుకును బజారుకీడ్చొద్దు : కోదండరాం

By

Published : Jan 23, 2021, 2:24 PM IST

భూమితో ముడిపడి ఉన్న రైతుల బతుకును బజారుకీడ్చొద్దని జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. చరిత్రలో భూమి కోసం పోరాటాలు చేసి ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు. రాష్ట్రంలోని పోడు భూముల్లో అటవీ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు.

all party leaders protest in support of podu farmers
టేకులపల్లిలో అఖిలపక్షం ర్యాలీ

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో హరితహారం పేరిట చేపడతున్న కందకం పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ శివారులో ఫార్మాసిటీ పేరుతో దోచుకోవాలనుకుంటున్న 20వేల ఎకరాల కోసం ఇప్పటికీ పోరాటం కొనసాగుతోందని జనసమితి అధ్యక్షుడు కోదండంరాం తెలిపారు. జహీరాబాద్ సమీపంలో ఇండస్ట్రీ పేరుతో 12వేల ఎకరాలు తీసుకోవాలని చూస్తే.. అక్కడి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని వెల్లడించారు. అభిప్రాయ సేకరణలో తమ భూములు ఇవ్వమని తెగేసి చెప్పారని పేర్కొన్నారు.

పోడు రైతులకు మద్దతుగా చేసిన ఈ ర్యాలీలో కోదండరాంతో పాటు న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details