తెలంగాణ

telangana

'పీపుల్స్‌ మార్చ్‌' పేరుతో ప్రారంభమైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్ర

By

Published : Mar 16, 2023, 10:47 PM IST

Bhatti Vikramarka Padaytra Update : ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. 'పీపుల్స్ మార్చ్' పేరుతో రాష్ట్రంలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో 1,365 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం బాగుపడిందే తప్ప అణగారిన వర్గాల వారికి ఎలాంటి మేలు జరగలేదని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, వీహెచ్, శ్రీధర్‌బాబు యాత్రలో పాల్గొన్నారు.

Bhatti Vikramarka
Bhatti Vikramarka

Bhatti Vikramarka Padaytra Update : రాష్ట్రంలో మరొక పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాదయాత్ర గత నెల ఆరో తేదీన మొదలై కొనసాగుతోంది. భారత్‌ జోడోయాత్రకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా హాథ్​ సే హాథ్​ జోడో అభియాన్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రాష్ట్రంలోను హాథ్​ సే హాథ్​ జోడో పేరుతో రేవంత్​రెడ్డి చేపట్టిన యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రకు ప్రజలలో మంచి ఆదరణ వస్తోంది. అక్కడ చూసినా కార్యకర్తలు, ప్రజలు రేవంత్​కు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా యాత్రలో పాల్గొంటున్నారు.

తాజా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క "పీపుల్స్‌ మార్చ్‌'' పేరుతో ఆదిలాబాద్​ జిల్లాలోని పిప్పిరి నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. కుమురం భీం విగ్రహానికి నివాళులు అర్పించి భట్టి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావీద్, రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తదితర నాయకులు హాజరయ్యారు. పిప్పిరి గ్రామం నుంచి మొదలయిన ఈ పాదయాత్ర ఇచ్చోడకు వరకు కొనసాగింది. అనంతరం ఇచ్చోడలో జరిగిన బహిరంగ సభలో నాయకులు ప్రసంగించారు.

అదిలాబాద్‌ జిల్లా పిప్పిరిలో మొదలయిన ఈ పాదయాత్ర రాష్ట్రంలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో 1,365 కిలోమీటర్ల మేర కొనసాగనుందని భట్టి విక్రమార్క తెలిపారు. 91 రోజుల పాటు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగే ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం పట్టణంలో జూన్‌ 15వ తేదీన ముగుస్తుందన్నారు. ఇచ్చోడ సభలో భట్టి విక్రమార్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యాత్ర ప్రారంభించామన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం బాగుపడిందే తప్ప అణగారిన వర్గాల వారికి ఎలాంటి మేలు జరగలేదని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే బెల్టు షాపులు మూసివేయిస్తామని ఆయన పేర్కొన్నారు.

రోజుకు 15 కిలోమీటర్లకు తక్కువ లేకుండా నడిచేందుకు వీలుగా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 3వ తేదీ నాటికి ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 240 కిలోమీటర్ల మేర కొనసాగే పాదయాత్రకు అవసరమైన రూట్‌ మ్యాప్‌ ఖరారు అయ్యినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ రెండో తేదీన మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌ రావు ఆధ్వర్యంలో మంచిర్యాలలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఈ మంచిర్యాల బహిరంగ సభకు రాజస్థాన్ ముఖ్యమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే, జాతీయ నాయకులను ఆహ్వానించాలని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details