ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చానుకు తన స్వరాష్ట్రం మణిపూర్లో ఘన స్వాగతం లభించింది. అభిమానుల హర్షాతిరేకాల మధ్య మంగళవారం మణిపూర్లోని ఇంఫాల్ విమానాశ్రయంలో చాను అడుగుపెట్టింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరెన్ సింగ్ ఆమెకు స్వాగతం పలికారు. అక్కడే ఉన్న తన తల్లిని చూసి ఆనందంతో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది చాను.
అనంతరం మణిపూర్ అధికారులు మీరాబాయి కోసం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. ఆ తర్వాత ఒలింపిక్స్లో పతక విజేతగా నిలిచిన అనుభూతిని మీరబాయి వెల్లడించారు. తన పతకాన్ని మణిపూర్ ప్రజలకు అంకితమిస్తున్నట్టు ప్రకటించింది చాను. ఇన్నేళ్లు తనకు అండగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపింది.