తెలంగాణ

telangana

జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొంటారు?

By

Published : Aug 29, 2020, 11:20 AM IST

భారతదేశంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే విధంగా క్రీడా టోర్నీలను నిర్వహించడం సహా అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను క్రీడా పురస్కారాలతో సత్కరిస్తారు. అసలు ఈ క్రీడా దినోత్సాన్ని ఎందుకు జరుపుకొంటారో చూద్దాం.

Why do we celebrate National Sports Day?
జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

ప్రపంచంలోని వివిధ దేశాలు ఆటల కోసం ఓ ప్రత్యేక రోజును కేటాయించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకొంటాయి. భారతదేశంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకను రాష్ట్రీయ ఖేల్​ దివాస్​ అని కూడా పిలుస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు ఎంతో ఉత్సాహంతో స్పోర్ట్స్​ డేలో పాల్గొంటారు .

జాతీయ క్రీడా దినోత్సవ ప్రాధాన్యం ఏంటి?

జీవితంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయని భావితరాలకు అవగాహన పెంచే విధంగా.. క్రీడల ఆవశ్యకతను తెలియపరిచే కార్యక్రమాలను నిర్వహించడమే దీని ప్రధాన లక్ష్యం. స్పోర్ట్స్​ డే సందర్భంగా నిర్వహించే వివిధ క్రీడా టోర్నీలు ఉత్తమ ప్రతిభను వెలికి తీయడానికి సహాయ పడతాయి.

ధ్యాన్​చంద్​

భారతదేశంలో క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?

ఉత్తరప్రదేశ్​లోని అలహాబాద్​కు చెందిన ఓ మధ్య తరగతి కుటుంబంలో 1905 ఆగస్టు 29న ధ్యాన్​చంద్​ జన్మించారు. ఈయన క్రీడా చరిత్రలో గొప్ప హాకీ ప్లేయర్​గా గుర్తింపు పొందారు. 1928, 1932, 1936 ఒలింపిక్స్​లో హాకీ జట్టుకు బంగారు పతకాన్ని అందించారు. ఆ స్ఫూర్తిని ఎంతోమందిలో పెంపొందించడానికి.. క్రీడల పట్ల ఆసక్తిని కలిగించడానికి ఆయన జయంతి నాడే జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆరోజు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆటగాళ్లకు పురస్కారాలనూ అందిస్తుంది.

జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

దేశవ్యాప్తంగా క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజల దృష్టిని ఆకర్షించడం, క్రీడలను ప్రోత్సాహించే ఉద్దేశంతో ఈ వేడుకలను జరుపుకుంటారు. క్రీడలు యువతకు ఉపాధి కల్పించడం సహా వారికి తగిన గుర్తింపును తెస్తాయి. దీంతో పాటు వివిధ ఛాంపియన్​షిప్​లలోని క్రీడలపై ప్రజల్లో అవగాహన పెంచుతాయి.

జాతీయ క్రీడా దినోత్సవం ఎలా జరుపుకొంటారు?

దేశంలో ఉన్న విద్యాసంస్థలు, క్రీడా సంస్థలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్టు 29న ఘనంగా నిర్వహిస్తారు. పంజాబ్​, హరియాణా, ఉత్తర ప్రదేశ్​ రాష్ట్రాల్లో ఈ రోజును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఎందుకంటే క్రీడాకారులు ఎక్కువగా ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం.

జాతీయ క్రీడా పురస్కారాలు

వర్చువల్​గా క్రీడా పురస్కార వేడుక

ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కార ప్రదానోత్సవం తొలిసారి వర్చువల్​ పద్ధతిలో జరగనుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో క్రీడా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29న హాకీ దిగ్గజం ధ్యాన్​ చంద్ జయంతి సందర్భంగా జరిపే ఈ వేడుకలో.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆన్​లైన్​ ద్వారా విజేతలకు పతకాలను అందజేయనున్నారు. తన నివాసం నుంచి ఎన్​ఐసీ లింక్​ ద్వారా రాష్ట్రపతి కార్యక్రమానికి హాజరు కానుండగా.. అవార్డు గ్రహీతలంతా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని సాయ్​, ఎన్​ఐసీ కేంద్రాల నుంచి పాల్గొననున్నారు. అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు సహా ఇతర ప్రముఖులు కూడా భాగం కానున్నారు.

ABOUT THE AUTHOR

...view details