టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) నుంచి భారత బృందం (indian olympic contingent) స్వదేశానికి చేరుకుంది. దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో వారికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) (SAI) డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ అదిల్లే సుమరివాలా ఘనస్వాగతం పలికారు. అథ్లెట్ల కుటుంబ సభ్యులతో పాటు స్థానిక రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. డోలు చప్పుళ్లతో, బ్యాండ్లు కొడుతూ, పాటలు పాడుతూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని పలువురు డ్యాన్స్లు చేశారు.
పతక విజేతలను చూడటానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున రావడం వల్ల ఎయిర్పోర్ట్ వద్ద కాస్త ఉద్రిక్త వాతవరణం నెలకొంది. చాలా మంది మాస్క్లు లేకుండానే వచ్చారు. భౌతిక దూరం పాటించకుండా కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. దీంతో ఆటగాళ్లు త్వరగానే అక్కడి నుంచి నిష్క్రమించారు.