తెలంగాణ

telangana

'కంగారూల గడ్డపై టెస్టు సిరీస్ విజయం.. ఓ సువర్ణాధ్యాయం'

By

Published : Jan 12, 2022, 3:38 PM IST

india vs australia
భారత జట్టు

Sunil Gavaskar on Indian Team: గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ఇండియా సిరీస్​ గెలిచిన సందర్భాన్ని గుర్తుచేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. భారత క్రికెట్ చరిత్రలో అది సువర్ణాధ్యాయమని అన్నాడు.

Sunil Gavaskar on Indian Team: కంగారూల గడ్డపై భారత జట్టు తొలి టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయమని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ అన్నాడు. ఇటీవల కాలంలో టీమ్‌ఇండియా సాధించిన విజయాల్లో ఇదే అత్యంత గొప్ప విజయమని పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు గాయాల పాలైనా.. చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో రాణించి ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించారని ప్రశంసించాడు.

"తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం పాలైన టీమ్‌ఇండియా.. రెండో టెస్టులో పుంజుకున్న తీరు అద్భుతం. ఆ మ్యాచులో భారత్‌ సాధించిన విజయం ఆటగాళ్ల దృఢ సంకల్పానికి నిదర్శనం. సిరీస్ ఆసాంతం ఆదిపత్యం చెలాయించి కంగారూల గడ్డపై సిరీస్ సాధించడమనేది భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాధ్యాయం. అలాంటి చారిత్రక విజయాన్ని చూసినందుకు చాలా గర్వపడుతున్నాను."

-- సునీల్ గావస్కర్‌, మాజీ క్రికెటర్.

ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించి త్వరలో ఏడాది పూర్తి కానున్న సందర్భంగా.. 'డౌన్‌ అండర్‌గోస్‌ - ఇండియాస్‌ గ్రేటెస్ కమ్‌బ్యాక్‌' అనే ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను జనవరి 14 నుంచి 'సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌' ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా భారత్‌ సాధించిన ఘన విజయంపై సునీల్ గావస్కర్‌ తన అభిప్రాయాలను సోనీ స్పోర్ట్స్ ఛానల్‌తో పంచుకున్నారు.

అజింక్య రహానే నాయకత్వంలోని టీమ్‌ఇండియా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మెల్ బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. హనుమ విహారి, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అసమాన పోరాటం చేయడంతో సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రా గా ముగిసింది. సిరీస్‌ నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా సమష్టిగా రాణించి.. మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. దీంతో కంగారూల గడ్డపై తొలి సారిగా భారత్‌ సిరీస్ సాధించి చరిత్ర సృష్టించింది.

ఇదీ చదవండి:

'భారత్​- పాక్​, ఆ రెండు జట్లతో టీ20 సిరీస్​.. ఐసీసీకి ప్రతిపాదిస్తా'

'అహాన్ని వీడి.. క్రమశిక్షణతో ఆడిన కోహ్లీ'

ABOUT THE AUTHOR

...view details