తెలంగాణ

telangana

CWG 2022: అమ్మాయిల ఫైనల్‌ మ్యాచ్​.. రోహిత్​సేన చేసిన పనికి ఫ్యాన్స్​ షాక్​!

By

Published : Aug 8, 2022, 11:43 AM IST

కామన్వెల్త్​ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళల క్రికెట్​ జట్టు​.. తొలి మ్యాచ్ నుంచి ఫైనల్‌ వరకు అద్భుత ప్రదర్శనను కనబరిచింది. ఫైనల్​లో ఓడినా క్రికెట్‌ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అయితే వీరు తుది పోరు ఆడుతున్న సమయంలో రోహిత్​ సేన చేసిన ఓ పని నెటిజన్లను ఆకర్షించింది. అదేంటంటే...

indian women cricket team
అమ్మాయిల ఫైనల్​ మ్యాచ్​

కామన్వెల్త్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత్‌ బ్రాంజ్​ మెడల్​ సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తుది పోరులో 9 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్‌ సేన ఓటమి పాలైనా... అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఇక చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్‌ పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతోపాటు భారత క్రికెట్‌ పురుషుల జట్టు కూడా ఆసక్తిగా వీక్షించడం విశేషం.

క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్న ఈ మ్యాచ్‌ను రోహిత్‌ సేన ఫ్లోరిడాలో మొబైల్‌ ఫోన్‌లో వీక్షించింది. రోహిత్ ఫోన్‌ను చేతిలో పట్టుకొని కూర్చోగా.. మిగతా ఆటగాళ్లంతా అతడి చుట్టూ గుమిగూడి మరీ మ్యాచ్‌ను తిలకించారు. ఆ సమయంలో అందరి ముఖాల్లో.. ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కనిపించింది. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది. 'కామన్వెల్త్‌లో మహిళల ఫైనల్‌.. ఎడ్జ్‌బాస్టన్‌లో ఉత్కంఠ. ఫైనల్‌ మ్యాచ్‌ను సీనియర్‌ మెన్స్‌ టీమ్‌ ఫాలో అవుతోందిలా' అంటూ దానికి కాప్షన్‌ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఫొటోను ట్రెండ్ చేస్తున్నారు.

ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ల్లో హర్మన్‌ప్రీత్‌ సేన 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు షెఫాలి (11), స్మృతి (6) త్వరగా వెనుదిరిగినా.. జెమీమా (33)తో కలిసి హర్మన్‌ప్రీత్‌ (65) పోరాడడంతో 14 ఓవర్లకు 112/2తో భారత్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. గార్డ్‌నర్‌ (3/16), షట్‌ (2/27) భారత్‌ను దెబ్బ కొట్టారు.

మరోవైపు టీమ్‌ఇండియా పురుషుల జట్టు జోరు కొనసాగుతోంది. వెస్టిండీస్‌ పర్యటనను ఘనంగా ముగించింది. ముందే టీ20 సిరీస్‌ గెలిచిన భారత్‌ ఆదివారం, చివరిదైన అయిదో మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (64; 40 బంతుల్లో 8×4, 2×6) చెలరేగడంతో మొదట భారత్‌ 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఛేదనలో వెస్టిండీస్‌ తడబడింది. రవి బిష్ణోయ్‌ (4/16), అక్షర్‌ పటేల్‌ (3/15), కుల్‌దీప్‌ యాదవ్‌ (3/12) ధాటికి 15.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది.

ఇదీ చూడండి: 'కష్టపడటమే నా మంత్రం.. దేశానికి పతకాలు అందిస్తూనే ఉంటా'

ABOUT THE AUTHOR

...view details