తెలంగాణ

telangana

'కోహ్లీ మళ్లీ అలాంటి షాట్లు కొట్టలేడు'.. పాక్ బౌలర్ షాకింగ్ కామెంట్!

By

Published : Jan 8, 2023, 3:37 PM IST

ప్రపంచకప్​లో తన బౌలింగ్​లో విరాట్ కోహ్లీ కొట్టిన సిక్సుల గురించి పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ స్పందించాడు. అతడి పర్ఫెక్ట్‌ టైమింగ్‌ వల్లే ఆ బంతి సిక్స్‌గా మారిందని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే?

haris-rauf-on-kohli-six
haris-rauf-on-kohli-six

భారత క్రికెటర్లకు దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ అభిమానులను ఉంటారు. ప్రత్యేకించి స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని అక్కడ ఎక్కువ మంది అభిమానిస్తారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12లో భాగంగా కోహ్లీ ఒంటిచేత్తో భారత జట్టును గెలిపించిన తీరును పాక్‌ మీడియా సైతం కొనియాడింది. ఇదిలా ఉంటే తాజాగా ఆ ఇన్నింగ్స్​పై పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల ఓ టీవీ షోలో హారిస్‌ రవూఫ్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ షో వ్యాఖ్యాత అతడి కళ్లకు గంతలు కట్టి తన ఎదురుగా.. తెరపై ఉన్న వ్యక్తిని గుర్తించాలని తెలిపాడు. అందుకు ఒక నిర్వచనాన్ని ఇస్తూ 'దంచి కొడతాడు.. గతంలో నువ్వు కూడా అతడి బాధితుడివే' అంటూ హింట్‌ ఇచ్చాడు. దీంతో ఆ సమయంలో అక్కడున్న ప్రేక్షకులు నవ్వారు. రవూఫ్‌ కూడా నవ్వుతూ 'అతడు విరాట్‌ కోహ్లీ' అంటూ టక్కున సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా విరాట్‌ గురించి మాట్లాడుతూ.. 'క్రికెట్ గురించి తెలిసిన వారెవరైనా కోహ్లీ ఎంత ప్రత్యేకమైన ఆటగాడో చెప్తారు. నేను వేసిన బంతులకు వరుసగా రెండు సిక్సులతో చెలరేగాడు. క్రికెటర్‌గా అతడి స్థాయి అలాంటిది. కోహ్లీ మళ్లీ అలా ఆడతాడో లేదో తెలియదు. అవి చాలా అరుదుగా ఆడే షాట్లు. అతడి పర్ఫెక్ట్‌ టైమింగ్‌ వల్లే ఆ బంతి సిక్స్‌గా మారింది' అంటూ రవూఫ్‌ పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12 పోరులో భాగంగా పాక్‌పై భారత్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపించాడు. చివరి 8 బంతుల్లో భారత్‌కు 28 పరుగులు అవసరమైన వేళ రవూఫ్ బంతులకు రెండు జంట సిక్సులు బాదాడు. దీంతో టీమ్‌ఇండియా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details