క్రికెట్ ప్రపంచంలో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగింది. బెట్టింగ్లో డబ్బులు కోల్పోయిన ఓ వ్యక్తి.. టీమ్ఇండియా అంతర్గత వివరాలు తెలుసుకునేందుకు ఇండియన్ టీమ్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ను సంప్రదించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సిరాజ్ అప్రమత్తమై.. ఈ విషయం గురించి బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్కు ఫిర్యాదు చేశాడు. తనకు ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చిందని తెలిపాడు. దీంతో అతను చెప్పిన వివరాలను నోట్ చేసుకున్న యాంటీ కరప్షన్ యూనిట్ సభ్యులు.. ఈ విషయంపై లీగల్గా ఫిర్యాదు నమోదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. ఆ వ్యక్తిని ట్రేస్ చేసి అదుపులోకి తీసుకుని దర్యప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి తమ అధీనంలోనే ఉన్నాడని, అతని నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నామని వివరించారు. ఫిబ్రవరిలో భారత్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ మొదలవ్వక ముందు ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.
కేసు విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అసలు సిరాజ్ను సంప్రదించింది బుకీ కాదని.. హైదరాబాద్కు చెందిన ఓ డ్రైవర్ అని తేలింది. బెట్టింగ్కు అలవాటు పడ్డ సదరు హైదరాబాద్కు చెందిన ఆ వ్యక్తి.. భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడని.. ఈ క్రమంలోనే అంతర్గత సమాచారం కోసం సిరాజ్ను సంప్రదించాడని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే ఇక్కడ మహ్మద్ సిరాజ్ స్వస్థలం కూడా హైదరాబాదే కావడం వల్ల ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ వ్యక్తితో సిరాజ్కు గతంలో సంబంధాలు ఏమైనా ఉన్నాయా లేదా.. అనే కోణంలోనూ దర్యాప్తు చేసినట్లు తెలిసింది.