వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబయి ఇండియన్స్.171 పరుగుల లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది చెన్నై.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి... సూర్యకుమార్, కృనాల్, పాండ్య రాణించడం వల్ల 170 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో తడబడింది చెన్నై సూపర్ కింగ్స్. 33 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా సహనంగా ఆడాడు కేదార్ జాదవ్. అయినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
కేదార్ ఒంటరి పోరు...
నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కేదార్ జాదవ్ వికెట్లు పడుతున్నా స్కోరు బోర్డును నెమ్మదిగా నడిపించాడు. 54 బంతుల్లో 58 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. 21 బంతుల్లో 12 పరుగులే చేసి విఫలమయ్యాడు కెప్టెన్ ధోని.
- మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చినసూర్యకుమార్ యాదవ్ అర్ధశతకంతోరాణించాడు. 43 బంతుల్లో 59 పరుగులు(8ఫోర్లు, ఒక సిక్స్)చేసి ఔటయ్యాడు. మరోవైపు సూర్యకు తోడుగా కృనాల్ (42) పరుగులు చేశాడు.
- హార్దిక్ హిట్టింగ్...
19 ఓవర్ల వరకు 141పరుగుల స్కోరు చేసిన ముంబయి జట్టు... చివరి ఓవర్లో భారీగా పరుగులు చేసింది. ఆఖరి ఓవర్ వేసిన బ్రావో 29 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబయి బ్యాట్స్మెన్ పాండ్య, పోలార్డ్ చెలరేగి ఆడారు. దీంతో 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది ముంబయి జట్టు.
బ్యాటింగ్లో రాణించిన హర్దిక్ బౌలింగ్లోనూ అదరగొట్టాడు. 4 ఓవర్లకు 20 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. మలింగ 3, బెహ్రండార్ఫ్ 2 వికెట్లు తీసి సత్తా చాటారు.
పొలార్డ్ అద్భుత క్యాచ్లు...
చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ సహా ఫామ్లో ఉన్న రైనాను అద్భుతమైన క్యాచ్లతో ఔట్ చేశాడు పొలార్డ్. ఒక దశలో రెండు ఫోర్లు , ఒక సిక్స్ కొట్టి వేగంగా ఆడుతున్న రైనా ఔట్ అవ్వడం మ్యాచ్ను మలుపు తిప్పింది.
నాలుగు వేల రికార్డు...
ఈ మ్యాచ్లో ధోనీ మరో మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో 4వేల పరుగుల రికార్డు సాధించాడు. 5087 పరుగులతో రైనా తొలి స్థానంలో ఉన్నాడు.