తెలంగాణ

telangana

BCCIపై హైదరాబాదీలు ఫుల్​ ఫైర్​.. టీమ్ఇండియా మ్యాచ్ ఒక్కటీ పెట్టరా?

By

Published : Jun 27, 2023, 10:13 PM IST

ICC World cup hyderabad : వన్డే వరల్డ్‌కప్‌ 2023కి సంబంధించిన హైదారాబాద్​ ఉప్పల్​ స్టేడియంలో టీమ్​ఇండియా మ్యాచులు నిర్వహించకపోవడంపై అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బీసీసీఐపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.

BCCI
BCCIపై హైదరాబాదీలు ఫుల్​ ఫైర్​.. ఎందుకీ వివక్ష అంటూ?

ICC World cup hyderabad : బీసీసీఐపై హైదరాబాద్‌ క్రికెట్​ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్​మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే.. నేడు(జూన్‌ 27న) వన్డే వరల్డ్‌కప్‌ 2023కి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్​(ఐసీసీ) విడుదల చేసింది. ఈ ప్రపంచ కప్​నకు సంబంధించిన మ్యాచులు పది వేదికల్లో జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్‌కు కూడా ఉంది. అయితే టీమ్​ఇండియాకు సంబంధించి హైదరాబాద్‌ వేదికలో ఒక్క మ్యాచ్ కూడా లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అసంతృప్తితో బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు.

టీమ్​ఇండియా ఒక్కటి కూడా..
వరల్డ్​కప్​లో భాగంగా హైదరాబాద్​ ఉప్పల్ స్టేడియంలో.. కేవలం పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్​లనే నిర్వహించనున్నారు. ఈ రెండు టీమ్​లు కూడా క్వాలిఫయర్స్​లో గెలిచే చిన్న జట్లతోనే ఆడనున్నాయి. ఇదే తెలుగు ఫ్యాన్స్​కు కోపం తెప్పించింది. ఉప్పల్ స్టేడియంపై బీసీసీఐ వివక్ష చూపుతోందని క్రికెట్​ ప్రియులు విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఏదో ఫార్మాలిటీగా ముష్టి పడేసినట్లు మూడు మ్యాచ్‌లు మా మొహాన పడేశారు', 'ఇంతదానికి హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించడం ఎందుకు', 'హైదరాబాద్‌పై బీసీసీఐకి ఎందుకు ఇంత వివక్ష చూపిస్తుంది' అంటూ తెగ అంసతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

హైదరాబాద్ అభిమానులకు అర్థం చేసుకోరా?
2011 వరల్డ్ కప్​ సమయంలోనూ హైదరాబాద్​ ఉప్పల్​ స్టేడియంలో టీమ్​ఇండియా మ్యాచులు జరగలేదు. అసలు అప్పుడు హైదరాబాద్​ను వేదికగా కూడా ఎంపిక చేయలేదు. 2016 టీ20 వరల్డ్​ కప్​లోనూ ఇదే జరిగింది. ఈసారైనా హైదరాబాద్​లో టీమ్ఇండియా ప్రపంచకప్ మ్యాచ్​ చూడాలని అనుకున్న అభిమానుల ఆశ తీరలేదు. నిజానికి అత్యంత లాయల్ క్రికెట్ ఫ్యాన్స్​కు హైదరాబాద్ వేదిక. 2022 సెప్టెంబర్​లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్​, 2023 జనవరి 18 న్యూజిలాండ్​తో మ్యాచ్​ జరిగినప్పడు భారీ సంఖ్యలో అభిమానులు టికెట్ల కోసం తరలి వచ్చారు. ఒకానొక దశలో టికెట్ల కోసం తొక్కిసలాట కూడా జరిగింది. హైదరాబాద్​లో క్రికెట్​ చూడటానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తారనడానికి ఇదే నిదర్శనం.

2023 ఐపీఎల్ సమయంలో కూడా క్రికెట్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం కళకళలాడింది. ఈ వేదికగా సన్​రైజర్స్ ఆడిన ప్రతి మ్యాచ్​కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ప్రతిసారీ స్టేడియం నిండిపోయేది. అలాంటప్పుడు ఎందుకు టీమ్​ఇండియా మ్యాచులు నిర్వహించలేదని హైదరాబాద్​ క్రికెట్ అభిమానులు అడుగుతున్నారు. దేశంలోనే అతిపెద్ద స్టేడియాల్లో ఇదొకటని, 50 వేల వరకు ప్రేక్షకులు సామర్థ్యం ఉందని, ఇక్కడ వర్షం పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని, రాత్రి సమయాల్లో తేమ కూడా తక్కువగా ఉంటుందని, టాస్​ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఫలితంగా మ్యాచ్​ హోరాహోరీగా జరిగే అవకాశాలు ఉంటాయని అంటూ స్టేడియం ప్రాముఖ్యతను ఫ్యాన్స్​ తెలియజేస్తున్నారు. పుణె, లఖ్​నవూ లాంటి స్టేడియాలలో టీమ్ఇండియా మ్యాచ్​లు పెట్టి.. హైదరాబాద్​ను విస్మరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్​లో జరిగే మ్యాచులు..
ICC world cup hyderabad matches : హైదరాబాద్​లో జరిగేవి మ్యూడు మ్యూచులే అయినా.. అవి టోర్నీ ఫ్రారంభమైన వారం రోజుల్లోనే అయిపోనున్నాయి. అక్టోబర్ 6న పాకిస్థాన్​-క్వాలిఫైయర్ 1జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. అక్టోబర్ 9న న్యూజిల్యాండ్-క్వాలిఫైయర్1 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 12న పాకిస్థాన్​- క్వాలిఫైయర్ 2 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

అవినీతే కారణమా?.. హైదరాబాద్‌లో కీలక మ్యాచులు నిర్వహించకపోవడానికి హెచ్‌సీఏ తీరు కూడా ఓ కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. హెచ్‌సీఏలో అవినీతి బాగా పేరుకుపోయిందని, బోర్డు సభ్యుల మధ్య ఆధిపత్య పోరు ఉండటం వల్ల బీసీసీఐ పట్టించుకోవట్లేదని అంటున్నారు. టికెట్ల విషయాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం.. ఇలా రకరకాల కారణాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు, ఆ సమయంలో తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఉంటుందని.. భద్రతాపరమైన కారణాలు కూడా ఇందుకు కారణం అయ్యుండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి :

ICC World Cup 2023 : భారత్​-పాక్ హై ఓల్టేజ్​ మ్యాచ్​.. ఎవరి బలం ఎంత?.. అదే రిపీట్​ అవుతుందా?

మోదీ స్టేడియంలో భారత్- పాక్ మ్యాచ్​.. ICC వరల్డ్​ కప్​ షెడ్యూల్ విడుదల

ABOUT THE AUTHOR

...view details