తెలంగాణ

telangana

రోహిత్ కెప్టెన్సీ ధోనీలా అనిపిస్తుంది: రైనా

By

Published : May 23, 2020, 3:27 PM IST

టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు కురిపించాడు సురేశ్ రైనా. అతడు కెప్టెన్సీలో ధోనీని తలపిస్తాడని చెప్పాడు.

రోహిత్
రోహిత్

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ నాయకత్వ లక్షణాలు మహేంద్రసింగ్‌ ధోనీలా ఉంటాయని వెటరన్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్నాడు. ప్రశాంతత, ఆటగాళ్లకు ప్రేరణ కల్పించడంలో అతడు మహీని గుర్తుకు తెస్తాడని వివరించాడు.

"రోహిత్‌ సారథ్యం అచ్చం మహీలా ఉంటుంది. పనులన్నీ ప్రశాంతంగా చేస్తాడు. ఆటగాళ్లలో ప్రేరణ నింపుతాడు. మైదానంలో బిందాస్‌గా ఉంటాడు. ఎప్పుడు మైదానంలోకి వెళ్లినా పరుగులు చేయగలనని అతడికి తెలుసు. ఆ ఆత్మవిశ్వాసమే ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. రోహిత్‌లో అదే నాకిష్టం"

-రైనా, టీమ్​ఇండియా క్రికెటర్

"ఈ మధ్యే పుణెతో ఫైనల్‌ చూశాను. ముంబయి సారథిగా రోహిత్‌ 2-3 అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మందకొడి వికెట్‌పై పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఓవర్ల మధ్య చక్కని నిర్ణయాలు తీసుకున్నాడు. తన జట్టుపై ఒత్తిడిని తగ్గించి ప్రత్యర్థి జట్టుపై పెంచాడు. అవన్నీ చూస్తుంటే అచ్చం ధోనీలా అనిపించాడు. బయట నుంచి కూడా సలహాలు వస్తాయని తెలుసు. కానీ ఎప్పుడేం చేయాలో అతడికీ తెలుసు. అందుకే సారథిగా ఎక్కువ (ఐపీఎల్‌) ట్రోఫీలు గెలవడంలో ఆశ్చర్యం లేదు" అని రైనా తెలిపాడు.

ముంబయి ఇండియన్స్‌కు రోహిత్‌ ఇప్పటి వరకు నాలుగు సార్లు టైటిళ్లు అందించాడు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్​పై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే అక్టోబర్-నవంబర్​ సమయంలో లీగ్​ జరిగే అవకాశం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details