టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టాలనుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇటీవలే లేఖ కూడా రాశాడు. అయితే యువీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడమనేది బోర్డు విధానాల్లో లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
తుది నిర్ణయం బోర్డుదే!
"యువరాజ్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడంపై తుది నిర్ణయం బోర్డు చేతిలో ఉంది. అయినా యువీ ఇప్పటికే వీడ్కోలుకు సంబంధించిన ప్రయోజనం పొందడం సహా నెలవారీ పెన్షన్ అందుకుంటున్నాడు. తిరిగి ఆడాలనే అతడి నిర్ణయం బీసీసీఐ విధానాలకు అడ్డంకి కావొచ్చు. ఏదీ ఏమైనా యువీ పంజాబ్ జట్టులో చేరితే అందులోని ఆటగాళ్లకు గొప్ప అనుభవం దక్కుతుందని" బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.