తెలంగాణ

telangana

'ఆసీస్​తో నాలుగో టెస్ట్​లో విజయం భారత్​దే.. కానీ!'

By

Published : Mar 6, 2023, 12:36 PM IST

india
india

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆసీస్​తో జరగబోయే నాలుగో టెస్టు మ్యాచ్​లో భారత్​ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని మాజీ దిగ్గజం సునీల్​ గావస్కర్​ అభిప్రాయపడ్డారు. ఇంకేమన్నాడంటే?

ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో పిచ్‌లపై విపరీతంగా చర్చ జరుగుతోంది. మూడో టెస్టు జరిగిన ఇందౌర్‌ పిచ్‌కు ఐసీసీ పేలవం రేటింగ్‌తో మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చింది. దీనిపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ మండిపడిన విషయం తెలిసిందే. దీంతో అహ్మదాబాద్‌ వేదికగా జరిగే నాలుగో టెస్టు పిచ్‌ ఎలా ఉంటుందనే విషయంపై అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో గావస్కర్‌ పిచ్‌లపై మరోసారి స్పందించాడు. సమతుల్య పిచ్‌లు ఉండాల్సిన అవసరముందని సూచించాడు.

"ఇలాంటి నాణ్యతతో పిచ్‌లు ఉండటం గొప్ప ఆలోచన అని నేను అనుకోను. బ్యాట్‌, బంతికి మధ్య సమతుల్యత ఉండే పిచ్‌లు ఉండాలి. మొదటి రెండు రోజులు కొత్త బంతి బౌలర్లకు కొంత సహకరించేలా.. బ్యాటర్లు పరుగులు చేయగలిగేలా పిచ్‌ ఉండాలి. ఆ తర్వాత 3, 4 రోజుల్లో బంతి కాస్త తిరగాలి" అని పిచ్‌ల గురించి సన్నీ వివరించాడు. ఇక అహ్మదాబాద్‌లో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నాడు. "అహ్మదాబాద్‌ పిచ్‌ టర్న్‌ అయితే.. భారత్‌ గెలిచే అవకాశాలు ఉండొచ్చు.. కానీ, మరోసారి పిచ్‌కు డీమెరిట్‌ పాయింట్లు వచ్చే ప్రమాదం ఉంది" అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

ఈ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించగా.. మూడో టెస్టులో ఆసీస్‌ గెలిచి టీమ్‌ఇండియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇక చివరిదైన నాలుగో టెస్టు అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details