Puneeth Rajkumar Biopic: కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నటుడిగా మెప్పించడమే కాదు.. నిజజీవితంలో తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారాయన.
ఇటీవలే పునీత్ అభిమాని సునీల్ ట్విట్టర్ వేదికగా పునీత్ బయోపిక్ చేయాలంటూ దర్శకుడు సంతోష్ను కోరారు. "సర్.. ప్లీజ్ అప్పు(పునీత్) సర్ మీద ఓ బయోపిక్ తీయండి. అప్పును దగ్గరి నుంచి చూశారు. ఆయన ప్రేమించే విధానం, పాటించే నైతిక విలువల గురించి మీకు ఎన్నో విషయాలు తెలుసు. అలాంటి మీరు దయచేసి అప్పు సర్ జీవితాన్ని తెర మీద చూపించండి" అంటూ ట్వీట్ చేశాడు. వెంటనే ఆ ట్వీట్కు స్పందించిన దర్శకుడు సంతోష్.. "అప్పు సర్ ఎప్పటికీ బతికే ఉంటారు. తెరమీద ఆయన జీవితాన్ని చూపించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా" అంటూ బదులిచ్చారు.
దర్శకుడు సంతోష్- నటుడు పునీత్(puneeth rajkumar yuvaratna movie) ఇద్దరూ విజయవంతమైన జోడీగా గుర్తింపు పొందారు. వీరిద్దరి కలయికలో 2017లో వచ్చిన 'రాజకుమార' చిత్రం కన్నడ చిత్రసీమలోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆపై 2021లో వచ్చిన 'యువరత్న' విజయం సాధించింది. 'యువరత్న'తో పునీత్ తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యారు. మూడోసారి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పునీత్ అకాల మరణంతో తీరని కలగా మారింది. దీంతో పునీత్ జీవితాన్నే తెరమీద చూపించడంటూ అభిమానులు దర్శకుడు సంతోష్ను కోరుతున్నారు.
ఇదీచూడండి: పునీత్ స్ఫూర్తితో.. నేత్రదానం కోసం 400 మంది దరఖాస్తు