తెలంగాణ

telangana

ప్రపంచంపై కొవిడ్​ విధ్వంసం- 3.04 కోట్లు దాటిన కేసులు

By

Published : Sep 18, 2020, 8:27 PM IST

Updated : Sep 18, 2020, 9:25 PM IST

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతూనే ఉంది. రోజుకు లక్షల చొప్పున కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 3కోట్ల 4లక్షల మందికిపైగా వైరస్​ బారనపడ్డారు. మొత్తంగా 9.51 లక్షల మంది కొవిడ్​తో మృతి చెందారు. అయితే.. కరోనాను అరికట్టేందుకు ఇజ్రాయెల్​ మరోసారి లాక్​డౌన్​ అస్త్రాన్ని ఎంచుకోగా.. త్వరలో యూకేలోనూ ఈ ఆంక్షలు మరిన్ని ప్రాంతాల్లో అమలు కానున్నాయి.

Global virus cases top 30 million, tally shows
ప్రపంచంపై కొవిడ్​ విధ్వంసం- 3.04 కోట్లు దాటిన కేసులు

గతేడాది డిసెంబర్‌లో చైనాలో బయటపడ్డ కొవిడ్‌-19 మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. కొన్ని రోజుల్లోనే ప్రపంచదేశాలకు వ్యాపించిన ఈ వైరస్‌.. ఇప్పటివరకు లక్షల మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా నిత్యం రెండు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3కోట్ల 4లక్షల మందికిపైగా కొవిడ్​ సోకింది. వీరిలో ఇప్పటివరకు 9లక్షల 51వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

చైనాలో మొదలై..

చైనాలో ప్రారంభమైన వైరస్‌ విజృంభణ.. ఆ తర్వాత యూరప్‌లో కొనసాగింది. అనంతరం అమెరికాలో విస్తరించి ఇప్పటికీ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం యూరప్‌లో కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఉత్తర, దక్షిణ అమెరికాలతోపాటు భారత్‌లోనూ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది.

వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న టాప్​-5 దేశాలివే..

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 68,78,222 2,02,274
భారత్​ 52,28,478 84,505
బ్రెజిల్​ 44,57,443 1,35,031
రష్యా 10,91,186 19,195
పెరూ 7,50,098 31,146

బ్రిటన్​లో మళ్లీ లాక్​డౌన్​

ఇంగ్లాండ్​లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో.. లాక్​డౌన్​ ఆంక్షలను మరిన్ని ప్రదేశాలకు విస్తరించింది యూకే ప్రభుత్వం. వచ్చే మంగళవారం నుంచి ఈ నిబంధనలను అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం రోజుకు 3వేలకుపైగా కొవిడ్​ కేసులు నమోదవుతున్నాయి. అయితే వ్యాధి వ్యాప్తి మరింత అధికమై రోజుకు 6వేల చొప్పున కొత్త కేసులు బయటపడతాయని.. యూకే జాతీయ గణాంక విభాగం హెచ్చిరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇజ్రాయెల్​లోనూ..

కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా మళ్లీ లాక్​డౌన్​నే అస్త్రంగా ఎంచుకుంది ఇజ్రాయెల్​. శుక్రవారం నుంచి ప్రారంభమైన లాక్​డౌన్​.. మూడు వారాలపాటు కొనసాగనుంది. దీంతో అక్కడ అన్ని వ్యాపారసంస్థలు, బహిరంగ సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు ప్రకటించారు. కొవిడ్​-19 కేసులను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్​లో ఇప్పటివరకు సుమారు 1.77లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. వారిలో 1,169 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:ఇంట్లోనే కరోనా టెస్ట్​- గంటలో ఫలితం!

Last Updated : Sep 18, 2020, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details