తెలంగాణ

telangana

అప్పుల ఊబిలో పాకిస్థాన్.. రూ.వందల కోట్ల ఆస్తులు గడిస్తున్న ఆర్మీ చీఫ్​

By

Published : Nov 21, 2022, 12:55 PM IST

pakistan army chief bajwa

Pakistan Army Chief Bajwa : దాయాది దేశం పాకిస్థాన్‌ అప్పుల కుంపటితో అల్లాడుతుంటే.. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మాత్రం కోట్లు గడిస్తున్నారు. ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావేద్‌ బజ్వా కుటుంబం సంపద గత ఆరేళ్లలో అమాంతం పెరిగినట్లు తాజా కథనం ఒకటి బయటకొచ్చింది. మరికొద్ది రోజుల్లో ఆర్మీ చీఫ్‌గా బజ్వా పదవీకాలం ముగియనున్న సమయంలో ఈ వార్తలు బహిర్గతమవడం పాక్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ కథనంలో ఏముంది? గత ఆరేళ్లలో బజ్వా కుటుంబం ఏమేర కూడబెట్టింది?. కథనం ప్రచురించిన సంస్థను పాక్‌ ప్రభుత్వం ఏం చేసింది?

Pakistan Army Chief Bajwa : పాకిస్థాన్​ ఆర్మీ చీఫ్‌ బజ్వా ఆస్తులపై ఫ్యాక్ట్‌ ఫోకస్‌ అనే సంస్థ ఓ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ సంస్థలో పనిచేస్తున్న ఓ పాకిస్థానీ జర్నలిస్టు దీన్ని బయటపెట్టారు. గత ఆరేళ్లలో బజ్వా కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు.. దేశ, విదేశాల్లో రూ.కోట్ల విలువైన వ్యాపారాలను ప్రారంభించారని, లగ్జరీ ఆస్తులను కొనుగోలు చేశారని ఆ కథనం వెల్లడించింది.

ఇస్లామాబాద్‌, కరాచీల్లో కమర్షియల్‌ ప్లాజాలు, ప్లాట్లు.. లాహోర్‌లో ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని వీరు కొనుగోలు చేశారని కథనం పేర్కొంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం.. గత ఆరేళ్లలో బజ్వా కుటుంబం కొనుగోలు చేసిన ఆస్తులు, వ్యాపారాల విలువ 12.7 బిలియన్‌ పాకిస్థానీ రూపాయలకు పైనే ఉంటుందని సదరు కథనం వెల్లడించింది.

2015లో బజ్వా సతీమణి అయేషా అంజద్‌ తన ఆస్తుల విలువను సున్నాగా ప్రకటించారు. అయితే ఒక్క ఏడాదిలోనే అంటే 2016లో ఆమె ఆస్తులు రూ.220కోట్లకు చేరడం గమనార్హం. అటు బజ్వా కోడలు మహనూర్‌ సాబిర్‌ ఆస్తులు కూడా అమాంతం పెరిగాయి. 2018 నవంబరులో బజ్వా కుమారుడితో మహనూర్‌ వివాహం జరిగింది. పెళ్లికి ముందు సున్నాగా ఉన్న మహనూర్‌ ఆస్తులు వివాహమైన వారానికే రూ.127కోట్లకు పెరిగాయని ఫ్యాక్ట్‌ ఫోకస్‌ కథనం తెలిపింది.

వెబ్​సైట్ బ్లాక్..
నవంబర్‌ 29తో పాక్‌ ఆర్మీ చీఫ్‌గా బజ్వా పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం పాక్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కథనం బయటకు రాగానే పాకిస్థాన్‌లో ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేేశారు.

ABOUT THE AUTHOR

...view details