తెలంగాణ

telangana

జీ7 సదస్సుకు మోదీ.. కీలక దేశాలతో చర్చలు.. డ్రాగన్​కు చెక్​ పెట్టేందుకే!

By

Published : May 19, 2023, 3:01 PM IST

modi-foreign-visit-2023-pm-modi-g7-summit-japan-2023-and-papua-new-guinea-australia-visits

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్​కు బయలుదేరారు. మే 19 నుంచి 21 వరకు హిరోషిమాలో జరిగే జీ7 దేశాల సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. అక్కడే చైనా దూకుడు వైఖరిపై ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలతో మోదీ కీలక చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రాగన్​కు కంటి మీద కునుకు లేకుండా పోయింది.

ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశాల సమావేశానికి జపాన్‌లోని హిరోషిమా వేదికైంది. జపాన్‌లోని హిరోషిమాలో శుక్రవారం నుంచి.. G 7 దేశాల సదస్సు జరగనుంది. హిరోషిమాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సహా జపాన్, ఇటలీ, కెనడా, జర్మనీ దేశాధినేతలకు ఘన స్వాగతం లభించింది. బైడెన్‌ తన సతీమణి జిల్ బైడెన్‌తో కలిసి హిరోషిమా చేరుకోగా.. రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి వచ్చారు. అనంతరం నేతలందరూ హిరోషిమా పీస్ మెమోరియల్ పార్కులో రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన వారికి అంజలి ఘటించారు.

G7 గ్రూప్‌లో సభ్య దేశం కానప్పటికీ.. అతిధి దేశంగా పాల్గొనాలన్న జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్‌ బయలుదేరారు. అధ్యక్ష స్థానంలో ఉన్న జపాన్‌.. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, వియత్నాంలకు అతిథి దేశాలుగా పాల్గొనాలని ఆహ్వానం పంపింది. జీ 7 దేశాల పర్యటనకు బయలుదేరే ముందు మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీ 7 సదస్సులో తన హాజరు చాలా అర్థవంతంగా ఉంటుందని ప్రధాని అన్నారు. ప్రపంచ సవాళ్లకు పరిష్కారం కనుగొనడంపై G7 దేశా‍ధినేతలు చర్చలు జరిపేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మోదీ అన్నారు. జీ 7 దేశాధినేతలు కొందరితో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతానని వెల్లడించారు.

జీ7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన వివిధ దేశాధినేతలు

శుక్రవారం నుంచి మొత్తం ఆరు రోజుల పాటు మోదీ విదేశీ పర్యటనలో ఉంటారు. జపాన్‌ పర్యటనలో భాగంగా ఆయన హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అణుభూమిలో శాంతి సందేశంగా గాంధీ విగ్రహం కొలువుతీరనుంది. మరోవైపు ప్రధాని మోదీ విదేశీ పర్యటన చైనాకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. చైనా దూకుడు వైఖరిపై ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలతో మోదీ కీలక చర్చలు జరపనున్నారు. జపాన్‌-భారత్‌ స్నేహం కూడా చైనాను చికాకు పెడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టే దిశగా ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారేమో అని డ్రాగన్‌ భయపడుతోంది.

జపాన్​కు వెళుతున్న ప్రధాని

ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించడమే ఈసారి జీ 7 దేశాల లక్ష్యంగా కనిపిస్తోంది. రష్యాపై ఆంక్షలపైనే ఎక్కువ రోజులు చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై.. అణు దాడికి వెనకాడబోమన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ బెదిరింపులు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, విపరీతంగా పెరుగుతున్న చైనా అణ్వాయుధ సంపత్తిపై జీ 7 దేశాల సదస్సులో చర్చ జరగనుంది. రష్యా ఇంకా భీకర దాడులు చేయకుండా ఉండేందుకు ఆంక్షలను రెట్టింపు చేయడంపై జీ 7 దేశాలు దృష్టి సారించనున్నాయి. రష్యాను మరింత ఒంటరిగా చేయడానికి ఉక్రెయిన్‌ రక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకు G7 దేశాలు చర్యలను చేపడతాయని అమెరికా వెల్లడించింది.

జపాన్​ పర్యటనలో బైడ్​న్​ దంపతులు, సునాక్​ దంపతులు, మేక్రాన్​లు

ABOUT THE AUTHOR

...view details