తెలంగాణ

telangana

చైనాలో 90 కోట్ల మందికి కరోనా.. 91 శాతం కేసులు అక్కడే!

By

Published : Jan 14, 2023, 6:43 AM IST

చైనాలో జీరో కొవిడ్​ విధానం ఎత్తివేయడం వల్ల.. మళ్లీ మహమ్మారి విజృంభిస్తోంది. జనవరి 11 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మంది వైరస్​ బారినపడినట్లు ఓ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. 141 కోట్ల డ్రాగన్​ దేశ జనాభాలో ఇది సుమారు 64 శాతం.

చైనాలో 90 కోట్ల మందికి కరోనా
చైనాలో 90 కోట్ల మందికి కరోనా

China Covid: చైనాలో కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోంది. గత నెలలో జీరో కొవిడ్‌ విధానం ఎత్తివేయడంతో.. స్థానికంగా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 11 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మందికి కరోనా సోకినట్లు ఇక్కడి పెకింగ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో ఇది వెల్లడైంది. 141 కోట్ల దేశ జనాభాలో ఇది దాదాపు 64 శాతం. అత్యధికంగా ఇక్కడి గాన్సు ప్రావిన్స్‌లో 91 శాతం (23.9 కోట్లు) మంది ప్రజలు వైరస్‌ బారిన పడ్డారు. యునాన్‌(84 శాతం), కింఘై(80 శాతం) ప్రావిన్స్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరో 2-3 నెలల వరకు అక్కడ కొవిడ్‌ గరిష్ఠ స్థాయి ఉంటుందని అంటువ్యాధుల నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. అలాగే వైద్య సదుపాయాల కొరత ఉన్న, గ్రామీణ ప్రాంతాలకు ఇది వ్యాపిస్తుందని హెచ్చరించారు.

ప్రస్తుతం చైనా ప్రజలు కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగిపోయారు. కోట్లాది మంది ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. కరోనాకు ముందు వరకు ఈ గ్రేట్‌ మైగ్రేషన్‌ కొనసాగింది. అయితే.. వైరస్ ఆంక్షల కారణంగా మూడేళ్లు ప్రజలు ఈ ప్రయాణాలకు దూరమయ్యారు. ఇటీవల జీరో కొవిడ్‌ విధానాన్ని ఎత్తివేయడంతో భారీస్థాయిలో రాకపోకలు ఉంటాయని చైనా రవాణాశాఖ అంచనా వేసింది. మరోవైపు దేశ జనాభాలో మూడో వంతుకన్నా ఎక్కువ మంది.. ఇన్ఫెక్షన్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ప్రాంతాల్లోనే ఉన్నారు. అయితే, కరోనా వ్యాప్తిలో తీవ్రదశ ఇంకా ముగియలేదని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రివెన్షన్‌లో విధులు నిర్వర్తించిన జెంగ్‌గాంగ్‌ హెచ్చరించారు. 'వైరస్ విషయంలో ఇప్పటివరకు నగరాలపైనే దృష్టి పెట్టాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టి సారించాల్సి ఉంది' అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details