Myanmar army helicopters target school : సైనిక పాలనలో ఉన్న మయన్మార్లో దారుణం జరిగింది. నార్త్-సెంట్రల్ మయన్మార్లోని ఓ పాఠశాల, గ్రామంపై సైనిక హెలికాప్టర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా అందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ పాఠశాలలో తిరుగుబాటుదారులు నక్కి దాడులు చేస్తున్నారని సమాచారం అందుకున్నందున తాము ఇలా కాల్పులు జరపాల్సి వచ్చిందని మయన్మార్ సైన్యం చెబుతోంది. మధ్య సాగింగ్ ప్రాంతంలోని తబయిన్ టౌన్షిప్ వద్ద శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బౌద్ధమఠాన్ని ఆధారంగా చేసుకొని పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ గ్రూపుకు చెందిన రెబల్స్ ఆయుధ రవాణా చేస్తున్నారని మయన్మార్ సైన్యం ఆరోపించింది. ఇక్కడ తనిఖీలకు వచ్చిన సైనిక హెలికాప్టర్లపై దాడి చేయడం వల్ల సైన్యం ప్రతిదాడి చేసిందని తెలిపింది. తిరుగుబాటుదారులు, ప్రజలను వారు మానవ కవచాలుగా వాడుకొంటున్నారని సైన్యం ఆరోపించింది. ఈ దాడిలో గాయపడ్డ వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని వెల్లడించింది.లెట్యట్కోనే అనే గ్రామంలోని ఓ బౌద్ధమఠంలో ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు.