తెలంగాణ

telangana

అపార్ట్​మెంట్​లో అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం

By

Published : Nov 25, 2022, 8:21 AM IST

fire accident

చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్​మెంట్​లో చెలరేగిన మంటల వల్ల 10 మంది మరణించగా.. మరో 9 మంది గాయపడ్డారు.

వాయువ్య చైనాలోని షింజియాంగ్​లో ఘోరం జరిగింది. ఓ అపార్ట్​మెంట్​లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గురువారం రాత్రి జరిగిందీ దుర్ఘటన. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులకు.. మంటలను అదుపు చేసేందుకు మూడు గంటల సమయం పట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

అంతకుముందు సోమవారం మధ్య చైనాలోని ఓ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఇటీవల కాలంలో చైనాలోని కర్మాగారాల్లో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో దీనిని కూడా ఒకటిగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ రంగ పత్రిక హెనాన్‌ డెయిలీ ప్రకారం ఈ కర్మాగారంలో విద్యుత్తు పరికరాల్లో చోటుచేసుకొన్న లోపాల కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నట్లు ఆ పత్రిక పేర్కొంది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

సోమవారం సాయంత్రం 4.30 సమయంలో హెనాన్‌ ప్రావిన్స్‌లో అన్యాంగ్‌ నగరంలోకి కయాక్సిండా ట్రేడింగ్‌ కో కర్మాగారంలో మంటలు వ్యాపించాయి. ఈ మంటలను అదుపు చేయడానికి దాదాపు మూడున్నర గంటలు కష్టపడాల్సి వచ్చింది. ఈ మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ సంస్థ పారిశ్రామిక వస్తువులు, రసాయనాల టోకు వర్తకం చేస్తుంది. చైనా ప్రభుత్వ రంగానికి చెందిన సీసీటీవీ కథనం ప్రకారం ఇక్కడ అనుమానాస్పద పదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు.

చైనాలోని కర్మాగారాల్లో ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. 2015లో టింజిన్‌లోని రసాయనాల గోదాముల్లో జరిగిన వరుస పేలుళ్లలో 175 మంది మృతి చెందారు. గత అక్టోబర్‌లో షెన్‌యాంగ్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు చనిపోగా.. 30 మంది గాయపడ్డారు. ఈ ఏడాది షాంఘైలోని ఓ పెట్రోకెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది.

ABOUT THE AUTHOR

...view details