ప్రపంచవ్యాప్తంగా కరోనాను నియంత్రించేందుకు.. టీకాల ఎగుమతిపై అమెరికా దృష్టి సారించాలని ఐరోపా సమాఖ్య పిలుపునిచ్చింది. టీకాలపై మేధో సంపత్తి హక్కుల రద్దు నిర్ణయం దీర్ఘకాలానికే ఉపయోగపడుతుంది అభిప్రాయపడింది.
"మేధో సంపత్తిపై చర్చించాలనుకునే వారు.. ఆ ప్రాంతం(అమెరికా)లో తయారవుతున్న వ్యాక్సిన్లను ఎగుమతి చేసే విధంగా కృషి చేసేందుకు కట్టుబడి ఉండాలి," అని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లేయాన్ వెల్లడించారు. పోర్చుగల్లో జరిగిన ఈయూ సదస్సులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఆమె.
ఈ వ్యవహారంపై ఈయూ వైఖరిని ఉద్దేశిస్తూ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఎలా ఉత్పత్తి చేయాలో తెలియని లాబ్లకు మీరు మేధో సంపత్తి హక్కులను ఇవ్వొచ్చు. కానీ.. రేపు అనే రోజున అవి టీకాలు ఉత్పత్తి చేయలేవు. బైడెన్ ప్రభుత్వం టీకాల ఎగుమతిపై దృష్టి సారించాలి. అమెరికాలో ఉత్పత్తి అవుతున్న 100శాతం వ్యాక్సిన్లు కేవలం అమెరికన్ మార్కెట్లోనే అందుబాటులో ఉంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మేమే ఎక్కువ శాతం టీకా పంపిణీ చేస్తున్నాము. ఐరోపా అందుకు గర్వపడాలి."