తమ దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం సహా ద్వైపాక్షిక అంశాలకు సంబంధించిన ఇతర విషయాలపై బైడెన్ సర్కార్తో ఇరాక్.. ఏప్రిల్ నెలలో వ్యూహాత్మక చర్చలను జరపనుంది. ఈ మేరకు ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి అమెరికాకు పంపిన అధికారిక మెమో అనంతరం.. ఈ ప్రకటన చేసింది అగ్రరాజ్యం.
ట్రంప్ పాలనలో గతేడాది జూన్లో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే.. బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే మొదటి సమావేశం ఇదే కానుంది. ఈ భేటీలో యూఎస్-ఇరాక్ల భవిష్యత్తు సంబంధాలను రూపొందించేందడమే లక్ష్యంగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భద్రత, వాణిజ్యం, వాతావరణం వంటి అంశాలూ ఇందులో ముడిపడి ఉన్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు.