'వీరసింహారెడ్డి' సక్సెస్ మీట్లో పాట పాడి అభిమానులను అలరించారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'వీరసింహారెడ్డి' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్ను ఆదివారం హైదరాబాద్లో నిర్వహించారు.
ఈ సక్సెస్ మీట్లో 'మాతో పెట్టుకోకు' సినిమాలోని 'మాఘమాసం లగ్గం పెట్టిస్తా' అనే పాటను స్టేజ్పై సింగర్తో కలిసి పాడారు బాలకృష్ణ. ఈ పాట బాలయ్య పాడాలని సింగర్స్ కోరడంతో స్టేజ్పైకి ఆయన వచ్చారు. వారితో కలిసి పాటను పాడి అభిమానులను అలరించారు. బాలకృష్ణ పాట పాడిన వీడియోను వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది.
గతంలో 'మేముసైతం' ఈవెంట్లో 'లెజండ్' సినిమాలోని 'నీ కంటి చూపుల్లో' అనే పాటను బాలకృష్ణ ఆలపించారు. తన పుట్టినరోజు సందర్భంగా గతంలో ఎన్టీఆర్ 'జగదేకవీరుని కథ' సినిమాలోని 'శివ శంకరి' ఆనే పాటను స్వయంగా పాడి రిలీజ్ చేశారు.
కాగా, అన్నాచెల్లెలి సెంటిమెంట్కు రాయలసీమ నేపథ్యాన్ని జోడించి దర్శకుడు గోపీచంద్ మలినేని.. 'వీరసింహారెడ్డి' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించారు. బాలకృష్ణ సోదరిగా వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్లో కనిపించారు. దునియా విజయ్, హనీరోజ్ కీలక పాత్రలు పోషించారు.