తెలంగాణ

telangana

Heroines: అందం.. అక్కా చెల్లెళ్లైతే

By

Published : Jun 20, 2022, 6:34 AM IST

కరీనా కపూర్‌ - కరిష్మా కపూర్‌, శిల్పాశెట్టి - శమితా శెట్టి, నగ్మ - జ్యోతిక.. ఇలా పలువురు అక్కాచెల్లెళ్లు హీరోయిన్లుగా వెండితెరపై సందడి చేశారు. అయితే ఇప్పుడీ ట్రెండ్‌ను కొనసాగిస్తూ నవతరం నాయికలూ తమ చెల్లెళ్లను రంగంలోకి దించారు. వారెవరో చూద్దాం...

siblings of heroines
అందం.. అక్కా చెల్లెళ్లైతే

మతిపోగట్టే సొగసులు ఒకరిలోనే ఉంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవద్దూ? నిజమే కదా మరి! అందుకే అదే అందం, అదే నటన అక్కాచెల్లెళ్లుగా మారి వెండి తెరను జిగేల్‌మనిపిస్తున్నాయి. ఇలా వెండితెరపై అక్కా చెల్లెళ్లు సందడి చేయడం కొత్తమీ కాదు. కరీనా కపూర్‌ - కరిష్మా కపూర్‌, శిల్పాశెట్టి - శమితా శెట్టి, నగ్మ - జ్యోతిక తదితరులు చిత్రపరిశ్రమలో మెరిసినవాళ్లే. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ నవతరం నాయికలూ తమ చెల్లెళ్లను రంగంలోకి దించుతున్నారు.

డబుల్‌ ఫిదా.. సహజమైన అందంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయిక సాయి పల్లవి. 'ప్రేమమ్‌' ద్వారా భాషతో సంబంధం లేకుండా యువతకు చేరువైన ఈ అందం 'లవ్‌ స్టోరీ', 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రాల్లోని తన నటనతో 'ఫిదా' చేసింది. 'విరాట పర్వం'తో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి చెల్లెలే పూజ కన్నన్‌. 2021లో తమిళంలో విడుదలైన 'సిత్తిరాయ్‌ సెవ్వానమ్‌' సినిమాతో వెండితెర కథానాయికగా మారింది. అంతకు ముందు 2017లోనే 'కారా' అనే లఘు చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాయిపల్లవి, పూజకన్నన్​

అతిలోక అందమై.. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ ఇప్పటికే తనదైన నటనతో మెప్పిస్తోంది. 2018లో ‘ధడక్‌’ చిత్రంతోనే విజయమందుకున్న ఈ ముద్దుగుమ్మ... ‘గుంజన్‌ సక్సేనా’ చిత్రంలో తనలోని నటిని పరిచయం చేసింది. ప్రస్తుతం ‘గుడ్‌ లక్‌ జెర్రీ’తో అందర్నీ అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ అమ్మడి చెల్లి ఖుషీ కపూర్‌ తెరంగ్రేటానికి ఇప్పటికే అడుగులు పడ్డాయి. జోయో అక్తర్‌ తెరకెక్కిస్తున్న ‘ఆర్చీస్‌’తో నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకులకు తన ప్రతిభ చూపించనుంది. ప్రస్తుతం చాలా కథలు వింటున్నామని తగిన చిత్రంతో ఖుషి త్వరలోనే థియేటర్లో సందడి చేయనుందని తండ్రి బోనీ కపూర్‌ ఇటీవలే మీడియో చెప్పారు.

జాన్వీ, ఖుషీ కపూర్​

శ్రుతికి అక్షర తోడు.. టాలీవుడ్‌ బ్యూటీ బాంబ్‌ శ్రుతీ హాసన్‌. 2000లో కమల్‌ హాసన్‌ నటించిన ‘హే రామ్‌’ చిత్రంతో శ్రుతి బాల నటిగా అడుగుపెట్టింది. సిద్ధార్థ్‌ సరసన నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’, ‘ఓ మై ఫ్రెండ్‌’ చిత్రాలతో తనను తాను నిరూపించుకుంది. పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’తో తిరుగులేని స్టార్‌డమ్‌ సొంతం చేసుకుంది. తర్వాత వరసగా ‘బలుపు’, ‘ఎవడు’, ‘రేసు గుర్రం’, ‘శ్రీమంతుడు’ చిత్రాలతో కమర్షియల్‌ చిత్రాలకు విజయవంతమైన నటిగా పేరు తెచ్చుకుంది. ప్రేక్షకులకు రెట్టింపు ఆనందాన్ని ఇవ్వడానికన్నట్లు తన సోదరి అక్షర హాసన్‌ తెరంగేట్రం చేసింది. తమిళ చిత్రాలు ‘కడారమ్‌ కొండాన్‌’, ‘వివేగమ్‌’తో పాటు ‘దీవానా’, ‘లాలీ కీ షాదీ’ తదితర హిందీ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం నవీన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అగ్ని సిరగుగల్‌’ అనే చిత్రంలో విజయ్‌ ఆంథోని సరసన నటిస్తోంది.

శ్రుతిహాసన్​, అక్షర్ హాసన్​

అక్క బాటలో... సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కథానాయకుడిగా వచ్చిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది కృతి సనన్‌. ఆ తర్వాత ‘హీరోపంతి’లో నటించి బాలీవుడ్‌లో పాగా వేసింది. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘ఆదిపురుష్‌’ చిత్రంలో జానకిగా నటిస్తోంది. తన అక్క బాటలో నడవడానికి వచ్చేసింది నుపుర్‌ సనన్‌. ‘నూరానీ చేహ్రా’ సినిమాతో కథానాయికగా మారింది. మొదటి సినిమాలోనే నవాజుద్దీన్‌ సిద్దిఖీతో కలిసి నటించింది. రవితేజతో కలిసి ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రీకరణలో బిజీగా ఉంది.

కృతిసనన్​, నుపుర్‌ సనన్‌

కత్రిన దారిలో ఇసాబెల్లా.. వెన్నెల లాంటి తన నవ్వుతో ‘మల్లీశ్వరి’గా వచ్చిన కథానాయిక కత్రినాకైఫ్‌. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా బాలీవుడ్‌లో అగ్రతారగా ఎదిగింది. ‘రేస్‌’, ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’, ‘ఏక్‌ థా టైగర్‌’, ‘పార్ట్‌నర్‌’ తదితర చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం తను నటించిన ‘ఫోన్‌ బూత్‌’, ‘మెర్రీ క్రిస్‌మస్‌’ చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. భారతదేశంలో తొలి సూపర్‌ఉమన్‌ చిత్రంలోనూ ఈ భామే కథానాయిక. తన ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఇసాబెల్లా కైఫ్‌ ‘టైమ్‌ టు డ్యాన్స్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆయుష్‌ శర్మ కథానాయకుడిగా నటిస్తున్న ‘క్వాథ’ చిత్రంలో నటిస్తోంది.

కత్రినా కైఫ్​, ఇసాబెల్లా

సోదరీమణుల సొగసు.. టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు రాజశేఖర్‌ తనయలు ఇద్దరూ కథానాయికలుగా మారారు. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా వచ్చిన ‘దొరసాని’ చిత్రంతో శివాత్మిక ఎంట్రీ ఇచ్చింది. ‘అద్భుతమ్‌’, ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ చిత్రాల్లో నటించిన ఇటీవలే శివాని తాజాగా ‘శేఖర్‌’లో కనిపించి ఆకట్టుకుంది. మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో ప్రస్తుతం వీరిద్దరూ బిజీగా ఉంటున్నారు.

శివాత్మిక, శివాని రాజశేఖర్​

ఇదీచూడండి:మహేశ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ కాంబో.. ట్రైలర్‌ అదరహో!

ABOUT THE AUTHOR

...view details