తెలంగాణ

telangana

MURDER: వంద రూపాయల కోసం అన్ననే చంపాడు!

By

Published : Aug 2, 2021, 3:51 PM IST

వంద రూపాయల కోసం ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. అన్నకు వంద ఎందుకు ఎక్కువ ఇచ్చావని తల్లిదండ్రులపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అన్నను కర్రతో బలంగా కొట్టాడు. ఈ ఘటనలో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు.

brother killed fro hundred rupees, a man murdered his brother
వందకోసం అన్ననే చంపాడు, వంద రూపాయల కోసం హత్య

వంద రూపాయల కోసం ఓ వ్యక్తి సొంత అన్ననే చంపాడు. తల్లికి వృద్ధాప్య పింఛను రాగా.. పెద్ద కుమారుడికి రూ.300, చిన్న కుమారుడికి రూ.200 ఇచ్చింది. వంద రూపాయలు అన్నకి ఎందుకు ఎక్కువ ఇచ్చావని.. మద్యం మత్తులో చిన్న కొడుకు తల్లితండ్రులపై దాడి చేశాడు. ఆపేందుకు వచ్చిన అన్నను కూడా... కర్రతో బలంగా కొట్టగా అతను మరణించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమావతిలో ఈ దారుణం జరిగింది.

వృద్ధ దంపతులకు పెద్ద కుమారుడు లక్ష్మన్న, చిన్న కుమారుడు రంగన్న సంతానం. వీరికి పెళ్లిళ్లై వేరువేరుగా నివసిస్తున్నారు. ఆదివారం తల్లికి వృద్ధాప్య పింఛను రాగా పెద్ద కుమారుడు లక్ష్మన్నకు రూ.300, చిన్న కుమారుడు రంగన్నకు రూ.200 ఇచ్చింది. రంగన్న ఆ డబ్బుతో మద్యం సేవించి తనకు వంద రూపాయలు తక్కువ ఎందుకు ఇచ్చావని ప్రశ్నిస్తూ... వృద్ధ తల్లిదండ్రులను కొడుతుండగా... అన్న లక్ష్మన్న జోక్యం చేసుకొని తమ్ముడిని వారించాడు.

రంగన్న ఆవేశభరితుడై మద్యం మత్తులో... కర్రతో అన్నను బలంగా కొట్టాడు. ఆ దెబ్బలకు లక్ష్మన్న అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడని... మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న రంగన్నను పట్టుకునేందుకు... పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. మృతుడికి ఇద్దరు సంతానం. ఓ వైపు పెద్ద కుమారుడు మరణించి... మరోవైపు చిన్న కుమారుడు ఇదంతా చేశాడని తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదీ చదవండి:FATHER KILLS SON: కర్రతో మోది కన్నకొడుకునే చంపిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details