తెలంగాణ

telangana

పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృత్యువాత.. పొలం పనులు చేస్తూనే..!

By

Published : Apr 13, 2021, 7:46 AM IST

సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. సోమవారం కురిసిన భారీ వర్షం నేపథ్యంలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. వేర్వేరు గ్రామాలకు చెందిన రైతులు... పొలం పనులు చేస్తుండగా విషాదం నెలకొంది.

farmers death due to thunder, siddipet farmers death
పిడుగుపాటుకు రైతులు మృతి, సిద్దిపేటలో రైతులు మృతి

సిద్దిపేట జిల్లాలో పిడుగుపాటు కారణంగా ఒక్కరోజే ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామానికి చెందిన పట్నం నర్సింహులు, దౌల్తాబాద్ మండలంలోని హిందూప్రియాల్‌ రైతు నర్సయ్య మృతి చెందారు.

బలి తీసుకున్న పిడుగు

పట్నం నర్సింహులు రోజులాగే సోమవారం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో పశువుల పాకలో ఉన్నాడు. ఇదే సమయంలో పిడుగు పడి నర్సింహులు మృతి చెందగా మరో వ్యక్తి పట్నం యాదగిరి గాయపడ్డారు. క్షతగాత్రుడిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ మహబూబ్ తెలిపారు. నర్సింహులుకు ఒక బాబు ఉన్నాడు.

అక్కడికక్కడే మృతి

ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన సంబంగా రామయ్య తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. స్థానికంగా ఉన్న మర్రిచెట్టు కింద ఉండగా పిడుగు పడి రామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు సమీపంలో ఉన్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి వచ్చేలోపే విగత జీవిగా పడి ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

ఈ విషాద ఘటనలపై మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు.

ఇదీ చదవండి:నిద్రిస్తున్న వారిపై కారంపొడి చల్లి... గొడ్డలితో నరికేశాడు..

ABOUT THE AUTHOR

...view details