తెలంగాణ

telangana

డిగ్రీ ఏదైనా ‘లక్ష’ణంగా పట్టా.. నకిలీ ధ్రువపత్రాల గుట్టురట్టు

By

Published : Feb 22, 2022, 10:22 AM IST

Degree Fake certificates case : నకిలీ సర్టిఫికెట్ల కేసులో వీఎస్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడితోపాటు ఆరుగురు విద్యార్థులను టాస్క్‌ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పట్టాలన్నీ భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ యూనివర్సిటీ పేరుతో తయారైనట్లుగా గుర్తించారు. ఈ కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు.

Degree Fake certificates case , vs global educational consultancy
నకిలీ ధ్రువపత్రాల గుట్టురట్టు

Degree Fake certificates case : నకిలీ సర్టిఫికేట్ల కేసులో టాస్క్‌ ఫోర్స్ పోలీసులు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. విద్య, ఉపాధి సేవల పేరుతో కన్సల్టెన్సీని నిర్వహిస్తూ డిగ్రీ నకిలీ పట్టాలను విక్రయిస్తున్న పొలాసి కొరివి వీరన్న స్వామి, పట్టాలు కొన్న ఆరుగురు విద్యార్థులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఈ పట్టాలన్నీ భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ యూనివర్సిటీ పేరుతో తయారైనవేనని సీఐ కె.నాగేశ్వర్‌రావు తెలిపారు. ఎస్‌ఆర్కే యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి ఈద విజయ్‌కుమార్‌ నకిలీ పట్టాల తయారీలో సహకరించారని, ఇటీవల అరెస్ట్‌ చేసిన సహాయ ఆచార్యుడు కేతన్‌ సింగ్‌గుండేలా ఈ కేసులోనూ నిందితుడని వివరించారు. బాచుపల్లిలో ఆంటున్న వీరన్నస్వామి, మలక్‌పేటలో వీఎస్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ పేరుతో నాలుగేళ్లుగా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. రెండేళ్లుగా కేతన్‌సింగ్‌తో కలిసి నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నాడు. ఈ కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు.

పెళ్లి కోసం..

వీరన్నస్వామితోపాటు అరెస్టైన యువకులు సాయిగౌతమ్‌, రితేశ్‌రెడ్డి, వెంకటసాయి రోహిత్‌, మన్నా విల్‌ఫ్రెడ్‌, సూర్యతేజ, తుమ్మల సాయితేజలను పోలీస్‌ ఉన్నతాధికారులు విచారించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉంటున్న ఓ యువకుడి తండ్రి జిల్లాలో రెండు ప్రైవేటు విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరి మధ్యలోనే మానేశాడు. 25 ఏళ్లు వచ్చాయి.. పెళ్లి చేయమని బంధువులు ఒత్తిడి చేస్తుండడంతో వీరన్నస్వామి వద్ద రూ.2.40 లక్షలకు ఇంజినీరింగ్‌ నకిలీ పట్టా తీసుకున్నాడు.

*కర్నూల్‌ వాసి విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు రూ.2.50 లక్షలకు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పట్టాను కొన్నాడు.

*వికారాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగి పదోన్నతి కోసం బీఈ మెకానికల్‌ డిగ్రీని రూ.2 లక్షలకు కొన్నాడు.

*బీఎస్సీ, బీకాం పట్టాలు కొన్న ఇద్దరు యువకులు ఎంబీఎ కానీ, కార్పొరేటు బ్యాంకుల్లో కొలువు కానీ కొట్టాలనుకున్నారు.

*గుంటూరు యువకుడు అమెరికాలో ఎంఎస్‌ చేసేందుకు రూ.2.10 లక్షలతో బీటెక్‌(సీఎస్‌సీ) పట్టా కొన్నాడు.

ఇదీ చదవండి:అమెరికా నుంచి పార్శిల్​లో పరుపు.. ఓపెన్​ చేస్తే గంజాయి.. ఆ తర్వాత..

ABOUT THE AUTHOR

...view details