తెలంగాణ

telangana

కట్టుకున్నదే ఖతం చేసింది.. మల్లెపూల కోసం పంపానంటూ కట్టుకథ అల్లింది

By

Published : Feb 8, 2023, 11:54 AM IST

Auto Driver Murder Case Update: ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఏడేళ్ల దాంపత్య జీవితం సాఫీగా సాగింది. భార్య విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులు తొక్కింది. కల్లు, మద్యం తాగుతూ ఇతర వ్యసనాలకు బానిసైంది. భర్తకు ఓ బాలికతో రహస్యంగా పెళ్లి చేసింది.. ఇక్కడ వరకు అంతా సాఫీగా సాగింది. బాలిక దగ్గరయిందని భావించిన భర్త తనను వదిలించుకోవాలని ఎత్తులు వేయడంతో.. భార్య అదే బాలికతో కలిసి అతన్ని దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్​ నగరంలో చోటుచేసుకుంది.

Murder Case
Murder Case

Auto Driver Murder Case Update: హైదరాబాద్ జీడిమెట్ల ఠాణా పరిధిలోని సంజయ్‌గాంధీనగర్‌లో సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్‌ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం జరిగిన ఈ హత్య కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులకు కొన్ని ఆశ్చర్యపోయే అంశాలు తెలిశాయి. మరికొన్ని విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు.. సోమవారం హత్యకు గురైన సురేశ్​ (28)తో రేణుకకు 2016లో ప్రేమ వివాహం జరిగింది. ఆమె క్రమంగా చెడువ్యసనాల బాట పట్టింది. నిత్యం కల్లు దుకాణాలు, మద్యం దుకాణాల వద్ద తిష్ఠ వేసేది. పరాయి వ్యక్తులతో మాటలు కలిపేదని ఆరోపణలున్నాయి. కొన్ని రోజుల క్రితం బహదూర్‌పల్లిలోని ఓ కల్లు దుకాణం వద్ద దుండిగల్‌ తండాకు చెందిన అనాథ బాలికతో మాట కలిసింది. ఇద్దరి మద్య పరిచయం పెరిగింది. బాలికకు ఎవరూ లేకపోవడంతో తమ ఇంటికి తీసుకొచ్చింది. 15 రోజులుగా అందరూ కలిసుంటున్నారు.

మృతుడి భార్య రేణుక

భర్త మెప్పు కోసం బాలికతో పెళ్లి :భర్త మెప్పు పొందేందుకు ఇంట్లోనే రహస్యంగా బాలికతో అతనికి పెళ్లి చేసింది. అయితే బాలిక తనకు దగ్గరవ్వడంతో సురేశ్​.. రేణుకను వదిలించుకోవాలని చూసినట్లు సమాచారం. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఆదివారం రాత్రి ముగ్గురూ కలిసి మద్యం తాగారు. భర్త మద్యం మత్తులో నిద్రపోవడంతో బాలికతో కలిసి శాలువాను మెడకు బిగించి.. అటొకరు.. ఇటొకరు గట్టిగా లాగడంతో ఊపిరాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అనంతరం.. 'శవాన్ని ఓ సంచిలో పెట్టి రెండో అంతస్తు నుంచి ఇంటి ముందు రోడ్డుపై వదిలేశారు. నేరం నుంచి తప్పించుకునేందుకు కట్టుకథ అల్లారు. చంపిన అనంతరం సురేష్‌ బంధువులకు ఫోన్లు చేసి, తినేందుకు మటన్‌, మల్లెపూలు తీసుకురావాలని అతనిని బయటకు పంపించానని, తిరిగి రాలేదని రేణుక నమ్మబలికింది. మరుసటి రోజు తన భర్తను ఎవరో చంపి.. ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేసినట్లు వాపోయింది. ఏమీ తెలియనట్లు ఠాణాకు వెళ్లి విలపించింది.' అని పోలీసులు తెలిపారు. బంధువులు భార్యపై అనుమానం ఉందని చెప్పడంతో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details