Ameenpur Family suicide case Update : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వందనపురి కాలనీలో కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడిన శ్రీకాంత్ ఎలా చనిపోవాలో నెల ముందు నుంచే నెట్లో వెతికినట్లు పోలీసులు గుర్తించారు. కరోనా వల్ల శ్రీకాంత్ 4-5 నెలలు ఉద్యోగం లేకుండా ఉన్నట్లు తెలుసుకున్నారు. నెల క్రితమే టీసీఎస్లో చేరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Clues in Ameenpur Family suicide case : శ్రీకాంత్ ఫోన్డేటా ఆధారంగా కాల్ లిస్టు చూసిన పోలీసులకు ఫైనాన్షియర్ల నుంచి పలుమార్లు ఫోన్ వచ్చినట్లు తెలిసింది. డబ్బులు లేవని ఫైనాన్షియర్లకు శ్రీకాంత్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యలతోనే కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. కానీ వారింట్లో దేవుడి పటాలు బోర్లించి ఉండటం.. వారి ముఖాలకు బొట్లు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని.. పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత అసలు విషయాలు వెల్లడిస్తామని అమీన్పూర్ పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
Ameenpur Techie Family suicide case : ఈ నెల 20న సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వందన పురి కాలనీలో ఏడేళ్ల చిన్నారితో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. షాద్నగర్కు చెందిన శ్రీకాంత్ గౌడ్, అల్వాల్లోని బ్రాహ్మణ కులానికి చెందిన అనామికలు గత పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి అనురాగానికి ఏడేళ్ల కూతురు స్నిగ్ధ కూడా ఉంది. శ్రీకాంత్ గౌడ్ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా.. అనామిక స్థానికంగా ఉన్న ప్రాచీన్ గ్లోబల్ కార్పొరేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. ముచ్చటైన సంసారం.. ఏమైందో తెలియదు గానీ రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఫోన్ చేసినా ఫోన్ ఎవరూ స్పందించకపోవడం వల్ల అతను తన కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడం వల్ల అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.