తెలంగాణ

telangana

మరో పరువు హత్య.. ఈసారి కన్న కూతురినే చంపుకున్న తల్లిదండ్రులు..

By

Published : May 27, 2022, 2:22 PM IST

Updated : May 27, 2022, 4:47 PM IST

Parents killed daughter in nagol konda, adilabad district
Parents killed daughter in nagol konda, adilabad district

14:18 May 27

వేరే మతానికి చెందిన యువకున్ని ప్రేమిస్తోందని తెలిసి..

Honor Killing: ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పరువుహత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకదాన్ని మర్చిపోయేలోపే ఇంకోటి జరుగుతూ.. భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోనే ఇటీవల ఒకదాని వెనక ఇంకోటి రెండు పరువు హత్యలు సంచలనం సృష్టించాయి. అవి మరవకముందే.. ఇప్పుడు ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం నాగల్‌కొండలో మరో ఘాతుకం వెలుగుచూసింది.

ఇంతవరకు.. తమ ఇంటి ఆడపడుచులను ప్రేమించి వివాహం చేసుకున్నందుకు యువకులను హతమార్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. కన్న కూతుర్నే తల్లిదండ్రులు దారుణంగా చంపుకున్నారు. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందని తెలిసి.. కుమార్తె రాజేశ్వరి(20)ని కత్తితో గొంతు కోసి హతమార్చారు.

నాగల్​​కొండకు చెందిన పవర్ రాజేశ్వరి.. అదే గ్రామానికి చెందిన ముస్లిం అబ్బాయి షేక్‌ అలీమ్‌ గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి ఇద్దరి ఇళ్లలో ఒప్పుకోరని భావించారు. 45 రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు సామిత్రిబాయి, దేవీలాలా.. తమ కూతురు కనిపించటంలేదని నార్నూర్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. చరవాణి సిగ్నల్స్ ద్వారా అమ్మాయి, అబ్బాయి మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇద్దరినీ నార్నూర్​కు తీసుకువచ్చిన పోలీసులు.. అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. అబ్బాయిని రిమాండ్​కు తరలించారు. ఇతర మతస్థుడిని ప్రేమించిందన్న కారణంతో తమ కూతురిపై తల్లిదండ్రులు ద్వేషం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు రాజేశ్వరికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమ పరువు పోతుందనే భయంతో శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో గాఢ నిద్రలో ఉన్న కూతురి గొంతుకోసి కన్న తల్లిదండ్రులే కర్కశంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేశ్వరి తల్లిదండ్రులను అరెస్టు చేశారు.

ఇవీ చూడండి:

Last Updated :May 27, 2022, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details