తెలంగాణ

telangana

తల్లి 'రైతు బీమా' డబ్బుల కోసం కుమారుడి నిర్వాకం.. ఎంతకి తెగించాడంటే..?

By

Published : Aug 1, 2022, 5:01 PM IST

తల్లి బతికుండగానే బీమా డబ్బుల కోసం ఓ కుమారుడు ఆమె చనిపోయినట్లు పత్రాలు సృష్టించాడు. ఆపై రైతు బీమాకు దరఖాస్తు చేసి వచ్చిన 5 లక్షల రూపాయలను కాజేశాడు. అతడు చేసిన నిర్వాకం ఏడాది క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

వీరస్వామి
వీరస్వామి

బీమా డబ్బుల కోసం తల్లి చనిపోయిందని నకిలీ మరణ ధ్రువపత్రం సమర్పించి రూ.5 లక్షల రైతు బీమా సొమ్మును స్వాహా చేశాడు ఓ కొడుకు. అతడు చేసిన నిర్వాకం ఏడాది క్రితం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన కోల లింగమ్మకు చలి చీమల పాలెం శివారులో 9 గుంటల భూమి ఉంది. లింగమ్మ కుమారుడు వీరస్వామి, సమీప బంధువైన ఉప సర్పంచ్ కోలా సైదులు సహకారంతో గత ఏడాది ఏప్రిల్ 6, 2021న తల్లి మృతి చెందినట్లు నకిలీ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించాడు. ఆమెకు రావాల్సిన రైతు బీమా పరిహారం కోసం నామినీ అయినా వీరస్వామి ఏప్రిల్ 16న దరఖాస్తు చేశాడు. మే 6న బీమా పరిహారం డబ్బులు రూ.5 లక్షలు అతడి ఖాతాలో జమయ్యాయి.

ఈ క్రమంలో తల్లి లింగమ్మ రెండు పర్యాయాలుగా రైతు బంధు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో జూన్ 16న వేములపల్లి వ్యవసాయ అధికారులను సంప్రదించింది. ఆన్​లైన్​లో పరిశీలించిన అధికారులు ఆమె అప్పటికే చనిపోయినట్లు.. రైతు బీమా పరిహారం కూడా పొందినట్లు రికార్డులు నమోదు అయిన విషయం గుర్తించారు. దీంతో పాటు రైతు బీమా పరిహారం కోసం సమర్పించిన మరణ ధ్రువపత్రాన్ని జారీచేసిన గ్రామ కార్యదర్శి సంప్రదించగా.. తాను లింగమ్మ పేరుతో ఎటువంటి పత్రం జారీ చేయలేదని చెప్పారు.

ఈ విషయంపై జులై 28న వేములపల్లి పోలీస్​స్టేషన్​లో ఏవో ఫిర్యాదు చేశారు. వీరస్వామి అతనికి సహరించిన ఉప సర్పంచ్ కోల సైదులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. లింగమ్మ భర్త పది సంవత్సరాల క్రితమే చనిపోయాడు. తన కుమారుడు అమాయకుడని ఉప సర్పంచ్ కోలా సైదులు మాయ మాటలు చెప్పి తన కుమారుడు వీరస్వామితో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకొన్నాడని ఆమె తెలిపింది. మరణించిన తండ్రికి సంబంధించిన డబ్బులు వచ్చాయంటూ రూ.90వేలు మాత్రమే ఇచ్చాడని చెప్పారు. వ్యవసాయ అధికారులు నిర్ధారణ చేసుకోకుండా బీమా డబ్బులు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించింది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని లింగమ్మ కోరుతుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details