తెలంగాణ

telangana

చిన్నారి మృతిపై భగ్గుమన్న స్థానికులు.. దమ్మాయిగూడలో తీవ్ర ఉద్రిక్తత

By

Published : Dec 16, 2022, 6:53 PM IST

Updated : Dec 16, 2022, 7:17 PM IST

Extreme tension in Dammaiguda: పాఠశాలకు వెళ్లిన చిన్నారి అనుమానాస్పదంగా మృతిచెందడంతో హైదరాబాద్‌ దమ్మాయిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన పోలీసులు, అంబులెన్స్‌ను స్థానికులు అడ్డుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. చిన్నారి ఇందు మృతికి నిరసనగా దమ్మాయిగూడ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు.

Extreme tension in Dammaiguda
Extreme tension in Dammaiguda

చిన్నారి మృతిపై భగ్గుమన్న స్థానికులు.. దమ్మాయిగూడలో తీవ్ర ఉద్రిక్తత

Extreme tension in Dammaiguda: మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడ పరిధిలోని జవహర్‌ నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక ఇందు (10) మృతదేహాన్ని అనుమానాస్పద రీతిలో చెరువులో గుర్తించారు. దమ్మాయిగూడలోని అంబేడ్కర్‌ నగర్‌ చెరువు నుంచి బాలిక మృతదేహాన్ని వెలికితీసి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

అనంతరం మృతదేహాన్ని జవహర్‌నగర్‌కు తీసుకొచ్చిన క్రమంలో స్థానికులు ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం నివేదిక ఇచ్చిన తర్వాతే ఇందు మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్‌ చేశారు. అంబులెన్స్‌లో నుంచి బాలిక మృతదేహాన్ని కిందకు దించకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసు వాహనం, అంబులెన్స్‌ గంట నుంచి అక్కడే ఉన్నాయి. స్థానికులు, బాలిక బంధువులు అడుగడుగునా అడ్డుకుని ధర్నాకు దిగారు.

బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానికుల ఆందోళనతో జవహర్‌నగర్‌లో రాకపోకలు నిలిచిపోయాయి. పాప ఎందుకు మృతి చెందిందో కారణాలు తెలిపే శవపరీక్ష నివేదికను తమకు ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఇవ్వకుండా చిన్నారి మృతదేహం అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాప మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఒక దశలో పోలీసు వాహనంపై దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. చిన్నారి ఇందు మృతికి నిరసనగా దమ్మాయిగూడ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తి ర్యాలీని కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎక్స్రైషియా ప్రకటించాలని, ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ఏం జరిగిందంటే:నాలుగో తరగతి చదువుతున్న ఇందును తండ్రి నరేశ్‌ గురువారం ఉదయం దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాల వద్ద విడిచిపెట్టారు. ఆ తర్వాత బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బంది సమాచారం అందించారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

బాలిక పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. చుట్టు పక్కల గాలించి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ చోట బాలిక వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దాని ఆధారంగా విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్థానిక అంబేడ్కర్‌ నగర్‌ చెరువులో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు.

బాలిక ఏ విధంగా చెరువు వద్దకు వెళ్లిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలిక మాత్రమే అక్కడికి వెళ్లిందా? ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారిస్తున్నారు. పాఠశాల నుంచి చెరువు వద్దకు వెళ్లే మార్గంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తమ కుమార్తె కిడ్నాప్‌నకు గురైందని.. పోలీసుల జాప్యంతోనే చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 16, 2022, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details