తెలంగాణ

telangana

మెయిల్‌ హ్యాక్‌ చేసి నిర్మాణ సంస్థకు టోకరా.. రూ.64 లక్షలు స్వాహా

By

Published : Jul 7, 2022, 9:01 AM IST

CYBER CRIME: సైబర్​ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కేసుల సంఖ్య తగ్గకపోగా మరింత పెరుగుతూనే ఉంది. జంట నగరాల పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రోజూ 10కిపైగా కేసులు నమోదవుతుండటమే ఇందుకు తార్కాణం. తాజాగా నగరంలోని ఓ నిర్మాణ సంస్థ మెయిల్​ను హ్యాక్​ చేసిన సైబర్​ నేరగాళ్లు.. రూ.64.11 లక్షలు స్వాహా చేశారు.

మెయిల్‌ హ్యాక్‌ చేసి నిర్మాణ సంస్థకు టోకరా.. రూ.64 లక్షలు స్వాహా
మెయిల్‌ హ్యాక్‌ చేసి నిర్మాణ సంస్థకు టోకరా.. రూ.64 లక్షలు స్వాహా

CYBER CRIME: బంజారాహిల్స్‌లోని ఓ నిర్మాణ సంస్థ మెయిల్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.64.11 లక్షలు బదిలీ చేయించుకున్నారు. సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ నిర్మాణ సంస్థకు ఔటర్‌ హార్బర్‌ నిర్మించేందుకు ఇండియన్‌ నేవీ నుంచి కాంట్రాక్టు దక్కింది. ముడి సామగ్రితో పాటు కీలకమైన నిర్మాణాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలంటూ రెండు విదేశీ సంస్థలను కొద్ది రోజుల క్రితం నిర్మాణ సంస్థ సంప్రదించింది. లండన్‌కు చెందిన ఓ సంస్థ అందుకు ముందుకొచ్చింది.

నిర్మాణ సంస్థ కొద్ది రోజుల క్రితం రూ.64.11 లక్షలను లండన్‌ సంస్థ ఖాతాలో జమ చేసింది. రెండు రోజుల క్రితం లండన్‌ సంస్థ ప్రతినిధులు ఫోన్‌ చేసి మీరు ఇంకా డబ్బు పంపలేదని ప్రశ్నించారు. దీంతో తమ మెయిల్‌ హ్యాక్‌ చేసి ఎవరో డబ్బులు కాజేశారని గ్రహించిన నిర్మాణ సంస్థ ప్రతినిధులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్లీ కేంద్రంగా కొందరు నైజీరియన్లు హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీల మెయిళ్లను హ్యాక్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారని.. నిర్మాణ సంస్థతో పాటు, లండన్‌ సంస్థ మెయిళ్లనూ వీరు హ్యాక్‌ చేసి డబ్బులు కాజేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details