తెలంగాణ

telangana

ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్​

By

Published : Oct 29, 2022, 4:17 PM IST

Updated : Oct 29, 2022, 10:47 PM IST

ఎమ్మెల్యేలకు ఎర కేసులోని ముగ్గురు నిందితులను పోలీసులు అ.ని.శా కోర్టుకు తరలించారు. ముగ్గురు నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్​ విధించారు. హైకోర్టు ఆదేశాలు ఉండటంతో పోలీసుల కస్టడీ పిటిషన్​ను న్యాయమూర్తి తిరస్కరించారు.

Trs MLAs purchase case
Trs MLAs purchase case

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు అనిశా ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. హైకోర్టు ఆదేశాలతో రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీ స్వామిజీలను అదుపులోకి తీసుకన్న సైబరాబాద్‌ పోలీసులు.. మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి మరోసారి వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం ముగ్గురికీ చేవెళ్ల ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత సరూర్‌నగర్‌లోని అనిశా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసానికి తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపర్చారు.

నిందితులు ముగ్గురికీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. హైకోర్టు ఆదేశాలు ఉండటంతో పోలీసుల కస్టడీ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. తన ఆరోగ్య పరిస్థితిపై రామచంద్రభారతి పిటిషన్‌ దాఖలు చేయగా.. సోమవారం విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. జైలులో వైద్య సౌకర్యాలు కల్పించాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.

అసలేం జరిగిందంటే.. తెరాసను వీడి భాజపాలో చేరితో రూ.100 కోట్లతో పాటు సివిల్‌ కాంట్రాక్టు పనులు ఇస్తామని ప్రలోభపెట్టారని పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 27న న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా.. రిమాండ్‌ చేయడానికి తిరస్కరించారు. నిందితులను అరెస్టు చేయడానికంటే ముందు 41 సీఆర్పీసీ నోటీసు ఇవ్వలేదని అనిశా కోర్టు న్యాయమూర్తి పోలీసులను తప్పుబట్టారు. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించారు.

సైబరాబాద్‌ పోలీసులు దీనిపై హైకోర్టులో నిన్న అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. అనిశా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రిమాండ్‌ను తిరస్కరించడాన్ని సవాల్‌ చేశారు. నిందితులు విచారణకు సహకరించకపోవడం, చేసిన నేరాన్ని బట్టి ఏడేళ్ల వరకు శిక్ష పడుతుందని దర్యాప్తు అధికారి భావించినప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదని పోలీసుల తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్‌.. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్‌ సీపీ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తర్వాత అనిశా కోర్టులో హాజరుపర్చి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది.

ఇవీ చదవండి:'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. రెండు వేర్వేరు తీర్పులు

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితుల రిమాండ్‌కు హైకోర్టు గ్రీన్​సిగ్నల్

ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ మన రక్షణశాఖే.. ఉద్యోగులు ఎంతమందో తెలుసా?

Last Updated : Oct 29, 2022, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details