తెలంగాణ

telangana

జులై ఏడు నుంచి కాకతీయ ఉత్సవాలు.. ఓరుగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో..

By

Published : Jun 24, 2022, 9:30 AM IST

Kakatiya festivals starting from seventh july

Kakatiya festival: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జులై ఏడు నుంచి ఈ ఉత్సవాలను వారం రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.

Kakatiya festival: ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు వరంగల్‌లో గతంలో కాకతీయుల ఉత్సవాలు వైభవంగా జరిగేవి. 2015 వరకు ఏటా ప్రభుత్వం తరఫున నిర్వహించేవారు. ఆ తర్వాత మళ్లీ ఉత్సవాలు జరగలేదు. తాజాగా జులై ఏడు నుంచి ఈ ఉత్సవాలను వారం రోజుల పాటు అంగరంగవైభవంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా కాకతీయుల వారసుడు రానున్నారు. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లాలోని జగ్దల్‌పుర్‌లో ఉండే కమల్‌చంద్ర భంజ్‌ కాకతీయను రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, యువ చరిత్రకారుడు అరవింద్‌ ఆర్యలు వెళ్లి గురువారం ఆయనకు ఆహ్వాన పత్రం ఇచ్చారు. తన తల్లి, సోదరితో వస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది.

700 చిత్రాలతో ప్రదర్శన

టార్చ్‌ అనే స్వచ్ఛంద సంస్థ కాకతీయులపై గత కొన్ని నెలలుగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఉత్సవాల సందర్భంగా ఈ సంస్థ కాకతీయుల నిర్మాణాలపై సేకరించిన 700 చిత్రాలతో ప్రదర్శన, ఇంకా కాకతీయుల వైభవాన్ని చాటిచెప్పే అనేక కార్యక్రమాలుంటాయని మామిడి హరికృష్ణ తెలిపారు. ఉత్సవాలను హనుమకొండతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details