తెలంగాణ

telangana

Dalitha Bandhu: దళిత బంధు విజయవంతంగా అమలు చేయాలి: కలెక్టర్​

By

Published : Aug 27, 2021, 3:20 AM IST

దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న దృష్ట్యా ఇంటింటికి వెళ్లి సర్వే చేసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో క్లస్టర్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు, బ్యాంకర్లు, సహాయ సిబ్బందితో దళిత బంధు సర్వే నిర్వాహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Dalitha Bandhu
దళిత బంధు

కరీంనగర్​ కలెక్టరేట్ ఆడిటోరియంలో క్లస్టర్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు, బ్యాంకర్లు, సహాయ సిబ్బందితో కలెక్టర్​ ఆర్.వి.కర్ణన్ దళిత బంధు సర్వే నిర్వాహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఎక్కడా దళిత బంధు పథకం లాంటి పథకం లేదని ఈ పథకాన్ని ప్రతి దళిత కుటుంబానికి అందించి విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని, దీనితో దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారని అన్నారు. ఇలాంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 3 నుంచి 4గురు జిల్లా స్థాయి క్లస్టర్ ఆఫీసర్లను, వీరి క్రింద 4 నుంచి 5 గ్రామాలకు ఒక మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లు, సహాయ సిబ్బందిని నియమించామని కలెక్టర్ తెలిపారు. సర్వే టీములు ఉదయం 9.30 గంటలకు సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. దళిత వాడలోని ప్రతి ఇంటింటికి క్లస్టర్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్, సహాయ సిబ్బంది వెళ్లి ఆన్​లైన్ డాటాతో పాటు ఆఫ్​లైన్ డాటా కూడా సేకరించాలని ఆదేశించారు. సేకరించిన డాటా వివరాలను దళిత బంధు యాప్​లో నమోదు చేయాలని అన్నారు. ఈ సర్వే టీముతో పాటు ఆ మండలానికి కేటాయించిన బ్యాంకు అధికారులు కూడా పాల్గొని వెంటనే దళిత కుటుంబాల లబ్ధిదారులకు కొత్తగా తెలంగాణ దళిత బంధు బ్యాంక్ అకౌంట్​ ఖాతాలను తెరుస్తారని తెలిపారు. ప్రతి మండలానికి దళిత బంధు ఖాతాలు తెరుచుటకు బ్యాంకులను కేటాయించామని, హుజూరాబాద్ రూరల్ మున్సిపాలిటీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇల్లందకుంటలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, వీణవంక కేడీసీసీ, జమ్మికుంట రూరల్​కు ఎస్బీఐ, జమ్మికుంట మున్సిపాలిటీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.

దళిత వాడల్లో సర్వే టీములు వస్తున్నట్లు ఒకరోజు ముందుగానే చాటింపు వేయించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పారదర్శకంగా, సేవభావంతో ప్రతి దళిత కుటుంబాన్ని సర్వే చేసి వివరాలను సేకరించి, పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని అన్నారు. దళిత బంధు సర్వే పై ప్రతి మండలానికి ఒక రాష్ట్ర స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా ప్రభుత్వం నియమించిందని కలెక్టర్ తెలిపారు. వీరు కూడా దళిత బంధు ఇంటింటి సర్వే పై ప్రతి రోజు గ్రామాలలో పర్యటిస్తూ సర్వేను పర్యవేక్షిస్తారని తెలిపారు.

Dalitha Bandhu: దళిత బంధు విజయవంతంగా అమలు చేయాలి: కలెక్టర్​

ఇదీ చదవండి: కరీంనగర్​కు సీఎం.. దళితబంధుపై సమీక్ష

ABOUT THE AUTHOR

...view details