తెలంగాణ

telangana

రాష్ట్రంలో త్రిచక్ర విద్యుత్‌ వాహనాల పరిశ్రమ

By

Published : Apr 20, 2022, 5:05 AM IST

Updated : Apr 20, 2022, 7:14 AM IST

Largest Electric Auto Factory in Telangana: కాలిఫోర్నియాకు చెందిన‌ బిలిటీ ఎల‌క్ట్రిక్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ ఆటో ఫ్యాక్టరీని రాష్ట్రంలో స్థాపించేందుకు సిద్ధమైంది. ఆ విషయాన్ని కంపెనీ ప్రతినిధి రాహుల్ గ‌యాం వెల్లడించారు. ఏటా 2లక్షల 40 వేల ఎలక్ట్రిక్ వాహ‌నాల‌ను.. ఉత్పత్తి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కంపెనీని ప్రారంభించ‌బోతున్నట్లు తెలిపారు. బిలిటీ నిర్ణయంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు.

Electric Auto Factory
Electric Auto Factory

Largest Electric Auto Factory in Telangana: అమెరికాకు చెందిన ప్రసిద్ధ విద్యుత్‌ వాహనాల సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్‌ ఇంక్‌ రాష్ట్రంలో రూ.1,144 కోట్లతో భారీ త్రిచక్ర వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఏటా 2.4 లక్షల విద్యుత్‌ వాహనాల తయారీ సామర్థ్యంతో సంగారెడ్డి జిల్లా వెల్మల పారిశ్రామికవాడలో 13.5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి మంగళవారం తెలియజేసింది. దీన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. సంస్థకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో వాహనాల తయారీ పరిశ్రమలున్న బిలిటీ తమ సంస్థ విస్తరణలో భాగంగా భారత్‌లోని వివిధ ప్రాంతాలను పరిశీలించి తెలంగాణను ఎంచుకుంది. ఇక్కడ సంస్థకు చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది. తెలంగాణ విద్యుత్‌ వాహనాల విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉందని, మౌలిక వసతులు అత్యుత్తమంగా ఉన్నందున రాష్ట్రాన్ని విద్యుత్‌ వాహనాల ప్రపంచస్థాయి కేంద్రం(హబ్‌) మార్చడంలో తాము భాగస్వాములం కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని బిలిటీ ఎలక్ట్రిక్‌ సీఈవో రాహుల్‌ గాయమ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన గాయమ్‌ మోటార్‌ వర్క్స్‌(జీఎమ్‌డబ్ల్యూ)తో కలిసి పనిచేస్తామని తెలిపారు. 2023లో నిర్మాణాన్ని పూర్తి చేసి, 2024లో ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. కార్గో మోడల్‌ టాస్క్‌మ్యాన్‌, ప్యాసింజర్‌ వెర్షన్‌ అర్బన్‌ పేర్లపై త్రిచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తామని చెప్పారు.

ఈ ఏడాది ఈవీ రంగంలో ఇదే భారీ పెట్టుబడి:బిలిటీ నిర్ణయంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల(ఈవీ) రంగంలో ఇదే అతిపెద్ద పెట్టుబడి అని, ఈ రంగంలో తెలంగాణ మరింత వేగంగా ముందుకెళ్లేందుకు ఇది సహకరిస్తుందని తెలిపారు. ఇటీవలే అమెరికాకు చెందిన ఈవీ సంస్థ ఫిస్కర్‌ తన యూఎస్‌ పర్యటనలో కుదిరిన ఒప్పందం మేరకు హైదరాబాద్‌లో రెండో ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించడం శుభపరిణామమని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కేంద్రంలో నిరర్ధక ప్రభుత్వం:కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం కాదని, నిరర్థక(ఎన్‌పీఏ) ప్రభుత్వమని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌లో విమర్శించారు.‘‘దేశంలో ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్‌, డీజిల్‌ ఇంధన ధరలు అత్యధిక(ఆల్‌టైమ్‌ హై)స్థాయికి చేరాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎల్పీజీ సిలిండర్‌ ధర మన దగ్గర ఉంది. ఇంత దయనీయ పాలన కొనసాగిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వమని పిలవాలా లేక ఎన్పీఏ(నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్‌) అని పిలవాలా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:దళితబంధు అమలుపై త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం: కేసీఆర్​

Last Updated :Apr 20, 2022, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details