తెలంగాణ

telangana

పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ట్రయల్స్‌

By

Published : Jun 1, 2020, 5:39 PM IST

కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వైరస్​ నివారణ జాగ్రత్తలు తీసుకుంటు కొన్ని ముఖ్యమైన పరీక్ష కేంద్రాల్లో అధికారులు ట్రయల్ నిర్వహించారు. ఒక్కో బెంచిపై ఒక విద్యార్థి మాత్రమే... గదిలో గరిష్ఠంగా పది నుంచి 12 మంది మాత్రమే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 4న జరగనున్న విచారణలో హైకోర్టుకు పదో తరగతి పరీక్ష ఏర్పాట్లను వివరించనున్నారు.

ssc
ssc

ఈనెల 8 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు కరోనా నివారణ చర్యలతో విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ కొన్ని ముఖ్యమైన పరీక్ష కేంద్రాల్లో అధికారులు ట్రయల్ నిర్వహించారు. కరోనా నివారణ జాగ్రత్తలు పకడ్బందీగా తీసుకుంటామని హైకోర్టుకు నివేదించినందున.. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గేటు బయట.. దూరం నుంచి విద్యార్థి హాల్ టికెట్ పరిశీలిస్తారు. గతంలో మాదిరిగా విద్యార్థులను తనిఖీలు చేయరు. క్యూ పద్ధతిలో భౌతిక దూరం పాటిస్తూ గదిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

లక్షణాలుంటే ప్రత్యేక గది

విద్యార్థుల మధ్య దూరం ఉండేందుకు కేంద్రాల వద్ద చతురస్రపు ఆకారంలో డబ్బాలు లేదా సర్కిళ్లను గీస్తారు. పరీక్ష గదిలోకి వెళ్లక ముందే విద్యార్థులు శానిటైజర్​తో చేతులు కడుక్కోవాల్సి ఉంటుంది. ప్రవేశ ద్వారం వద్ద శరీర ఉష్ణోగ్రత పరిశీలిస్తారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా.. దగ్గు, జలుబు లక్షణాలు కనిపించినా.. ప్రత్యేక గదిలో ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో పరీక్ష రాయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

బెంచికి ఒక్కరు

ఒక్కో బెంచిపై ఒక విద్యార్థి మాత్రమే... గదిలో గరిష్ఠంగా పది నుంచి 12 మంది మాత్రమే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న 2,530 పరీక్ష కేంద్రాలను 4,535కి పెంచారు. ఇవాళ నిర్వహించిన ట్రయల్ పై అధికారులు సంతృప్తిగా ఉన్నారు. ఈనెల 4న జరగనున్న విచారణలో హైకోర్టుకు పదో తరగతి పరీక్ష ఏర్పాట్లను వివరించనున్నారు.

ఇదీ చదవండి:పదోతరగతి పరీక్షల షెడ్యూల్

ABOUT THE AUTHOR

...view details