తెలంగాణ

telangana

కుప్పానికి నీళ్లివ్వలేని జగన్ అరాచకం సృష్టిస్తున్నారన్న చంద్రబాబు

By

Published : Aug 26, 2022, 4:55 PM IST

Chandrababu Kuppam Tour ఏపీలోని కుప్పానికి నీళ్లివ్వలేని ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి అరాచకం సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అన్న క్యాంటీన్లపై దాడులు చేయించి రాక్షసానందం పొందుతున్నారని ఆక్షేపించారు. వైకాపాకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు తిరగబడితే వైకాపా నేతల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా వైకాపాకు కొమ్ము కాయడం హేయమన్నారు.

కుప్పానికి నీళ్లివ్వలేని జగన్ అరాచకం సృష్టిస్తున్నారన్న చంద్రబాబు
కుప్పానికి నీళ్లివ్వలేని జగన్ అరాచకం సృష్టిస్తున్నారన్న చంద్రబాబు

Chandrababu on CM Jagan: ఆంధ్రప్రదేశ్​లోని కుప్పం నియోజకవర్గంపై వైకాపా నేతలు కక్ష కట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని మోడల్‌ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 650 గృహాలతో మోడల్‌ కాలనీ నిర్మాణం ప్రారంభించామని.. 1+3 విధానంలో 3 వేల మందికి విస్తరించాలని ప్రణాళిక రూపొందించి అనుమతులు ఇచ్చామన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణం ఆపేశారన్నారు. కుప్పంపై సీఎంకు అభిమానం ఉంటే.. తాను 3 వేల ఇళ్లు కట్టిస్తే ఆయన 10వేల ఇళ్లు కట్టించాలన్నారు. రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి ఆపేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌, వైకాపా నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘నేరస్థుల పాలన ఎలా ఉంటుందో నిన్న చూశాం. కుప్పం చరిత్రలో అది చీకటి రోజు. ఈ నియోజకవర్గంపై మీకెందుకంత కోపం? పేదవాడి పొట్టనింపే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. దాని నిర్వాహకునిపై దాడి చేశారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌ ఉంటే దాన్ని ఇప్పటికీ సీఎం స్టాలిన్‌ కొనసాగిస్తున్నారు. హంద్రీనీవా పనుల్లో మరో రూ.50కోట్లు ఖర్చు చేసి ఉంటే నీళ్లు వచ్చేవి. నేను పులివెందులను అభివృద్ధి చేశాను. గండికోట నుంచి నీళ్లిచ్చాను.- చంద్రబాబు, తెదేపా అధినేత

ఎస్పీ స్థానికంగా ఉన్నప్పుడే దాడి..:ఈరోజు ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్ద వందల మంది పోలీసులను భద్రతగా పెట్టారు. అదే పోలీసులను అన్న క్యాంటీన్‌ దగ్గర ఎందుకు పెట్టలేదు? పోలీసులు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు. పేదవాడికి అండగా ఉంటా.. నేను సీఎంగా ఉన్న 14 ఏళ్లు పోలీసులను ఇలాగే వినియోగించి ఉంటే నువ్వు బయట తిరిగేవాడివా? వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అభివృద్ధి చేయకుండా ఇప్పుడు గడపగడపకూ అంటూ తిరుగుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే వదిలిపెట్టను. నిన్న ఎస్పీ స్థానికంగా ఉన్నప్పుడే దాడి జరిగింది. ఆ పరిణామాలకు డీజీపీ సమాధానం చెప్పాలి’’ అని చంద్రబాబు అన్నారు.

కుప్పానికి నీళ్లివ్వలేని జగన్ అరాచకం సృష్టిస్తున్నారన్న చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details