తెలంగాణ

telangana

ఆస్తుల సర్వేకు మరో పది రోజుల వెసులుబాటు

By

Published : Oct 10, 2020, 8:23 AM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల సర్వే గడువు మరింత పెరగనుంది. అక్టోబరు 10 కల్లా ప్రక్రియ పూర్తిచేయాలనుకున్నా సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ క్రమంలో గడువు పెంచక తప్పని పరిస్థితి తలెత్తింది. వచ్చే పది రోజుల్లో సర్వే కొలిక్కి తేవాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.

Possibility of another ten days for asset survey in telangana
ఆస్తుల సర్వేకు మరో పది రోజుల వెసులుబాటుకు అవకాశం

భూవివాదాల పరిష్కార చర్యల్లో భాగంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయేతర భూముల సర్వే జరుపుతున్న సంగతి తెలిసిందే. దసరా నుంచి వ్యవసాయేతర ఆస్తులకు ప్రత్యేక పాసుపుస్తకాలు జారీచేయాలని భావిస్తున్న సర్కారు అక్టోబరు పదికల్లా ప్రక్రియ పూర్తిచేయాలని గడువు పెట్టింది. ఒక్కో కార్యదర్శి రోజుకు 60 ఆస్తులు సర్వే చేయాలని అధికారులు చెబుతున్నారు. జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్లకు సర్వే పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. ‘టి.ఎస్‌.నాప్‌’ పేరుతో ప్రత్యేకంగా యాప్‌నూ అభివృద్ధి చేశారు. కానీ, క్షేత్రస్థాయి సమస్యల కారణంగా సర్వే అనుకున్నంత వేగంగా జరగడంలేదు.

ఉదాహరణకు.. ప్రతి ఊళ్లో సగటున 20 శాతం ఇళ్లకు సంబంధించి పూర్తి వివరాలు దొరకడంలేదని, కొందరు యజమానులు వేరే ప్రాంతాల్లో ఉంటున్నారని, మరికొన్ని ఇళ్ల యజమానులు చనిపోయారని, ఇలాంటప్పుడు ఏంచేయాలన్న దానిపై మార్గదర్శకాలు లేవని ఓ కార్యదర్శి వెల్లడించారు. అన్నింటికీ మించి కొందరు గ్రామస్థులు వివరాలు చెప్పేందుకు, ఫొటో దిగేందుకు సైతం ఇష్టపడటంలేదని, వీరిని ఒప్పించడానికి తలప్రాణం తోకకు వస్తోందని, ఇలాంటప్పుడు ఆలస్యం అనివార్యమవుతోందని వారు వాపోతున్నారు. అలానే ఒక్కో ఆస్తికి సంబంధించిన సమాచారం నింపాలంటే యాప్‌లో కనీసం 30 వరకూ అంశాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఇవన్నీ క్రోడీకరించాక ఒక్కోసారి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక సందర్భాల్లో వివరాలన్నీ యాప్‌లో నమోదు చేశాక అకస్మాత్తుగా ఫోన్‌ స్తంభించిపోతోంది.

ఫలితంగా వాటిని మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సివస్తోంది. అలానే చాలామంది యజమానుల వద్ద వారి గుర్తింపుకార్డులు, ఆస్తికి సంబంధించిన పత్రాలు ఉండటంలేదు. కొందరైతే అసలు వివరాలు ఇచ్చేందుకే ఇష్టపడటంలేదు. ఇలాంటి సమస్యలు తరచుగా వస్తున్నాయని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. గ్రామకార్యదర్శుల్లో చాలామంది పదవీ విరమణకు దగ్గర్లో ఉన్నారు. వీరికి సాంకేతిక అంశాలపై పట్టులేదు. యాప్‌ ద్వారా సర్వే చేయడం వీరికి కాస్త ఇబ్బందిగా ఉంది. ఇలాంటి కారణాలతో సర్వే చాలా నెమ్మదిగా సాగుతోంది.

ప్రత్యామ్నాయం చూపండి

సర్వే వేగంగా సాగాలంటే తమకు ప్రత్యామ్నాయం చూపాలని, ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న సిబ్బందిని సహాయంగా పంపాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు పి.మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సర్వేకు కచ్చితమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, వయసు పైబడిన కార్యదర్శుల ఆరోగ్యం కరోనా కారణంగా దెబ్బతినే అవకాశం ఉన్నందున వారిపై కాస్త ఒత్తిడి తగ్గించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండిఃనిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు: జీవన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details