తెలంగాణ

telangana

Nursing Colleges in Telangana: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జిల్లాకో నర్సింగ్ కళాశాల

By

Published : Oct 1, 2021, 7:15 AM IST

తెలంగాణలో వైద్యవిద్యతో పాటు నర్సింగ్ విద్యకూ మహర్దశ రానుంది. సర్కార్ వైద్యంలో నర్సుల కొరతను అధిగమించడానికి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాకొక వైద్యకళాశాలను నెలకొల్పడమేగాక వాటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాల(Nursing Colleges in Telangana)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

తెలంగాణలో జిల్లాకు ఒక నర్సింగ్‌ కళాశాల
తెలంగాణలో జిల్లాకు ఒక నర్సింగ్‌ కళాశాల

సర్కారు వైద్యంలో నర్సుల కొరత ఎక్కువగా ఉంది. 30 మంది ఉండే వార్డుల్లో ఒక్కరే సేవలందిస్తున్న సందర్భాలు అనేకమున్నాయి. ఈ సమస్యను శాశ్వత ప్రాతిపదికన అధిగమించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాకొక వైద్యకళాశాలను నెలకొల్పాలని ఇప్పటికే నిర్ణయించగా.. తాజాగా వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల(Nursing Colleges in Telangana)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో వైద్యవిద్యతో పాటు నర్సింగ్‌ విద్యకూ మహర్దశ రానుంది. కొన్ని పట్టణాల్లో వంద పడకలకు పైగా ఇతర ఆసుపత్రులు ఉంటే.. వాటికి అనుబంధంగా కూడా నర్సింగ్‌ కళాశాలల(Nursing Colleges in Telangana)ను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో.. వైద్యఆరోగ్యశాఖ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నిర్వహించిన వైద్యఆరోగ్యశాఖ సమీక్షలోనూ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

భారీగా సీట్లు పెరుగుదల!

రాష్ట్రంలో ప్రస్తుతం ఉస్మానియా(హైదరాబాద్‌), గాంధీ(సికింద్రాబాద్‌), ఎంజీఎం(వరంగల్‌), జగిత్యాల, సిరిసిల్ల, రిమ్స్‌(ఆదిలాబాద్‌), నిమ్స్‌.. మొత్తంగా ఏడు ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో 480 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్‌లో 78 కళాశాలలుండగా.. వీటిలో 3,120 బీఎస్సీ నర్సింగ్‌ సీట్లున్నాయి. వీటికి అదనంగా కొత్తగా నెలకొల్పనున్న కళాశాలలతో రాష్ట్రంలో భారీగా సీట్లు పెరగనున్నాయి.

అందుబాటులోకి మరో 1,500 నర్సింగ్‌ సీట్లు..

వచ్చే ఏడాదిలోనే 14 కొత్త నర్సింగ్‌ కళాశాలల(Nursing Colleges in Telangana)కు దరఖాస్తు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరయ్యాయి. వీటి ద్వారా 1,400 సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2022-23 సంవత్సరానికి సర్కారు వైద్యంలోనే 1,880 నర్సింగ్‌ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా 2023-24 సంవత్సరానికి మరో 15 నర్సింగ్‌ కళాశాలలు వరకూ నెలకొల్పనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. కనీసం వంద పడకలున్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ 60 నర్సింగ్‌ సీట్లతో, 250-300 పడకలున్న చోట 100 సీట్లకు దరఖాస్తు చేయనున్నారు. ఫలితంగా కొన్ని జిల్లాల్లో రెండు నర్సింగ్‌ కళాశాలల(Nursing Colleges in Telangana)ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వీటి ద్వారా మరో 1,500 నర్సింగ్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

వైద్యసేవల్లో నాణ్యత పెరుగుతుంది

"నర్సింగ్‌ సీట్లు పెరగడం వల్ల ప్రభుత్వ వైద్యంలో నాణ్యత ప్రమాణాలు మెరుగవుతాయి. నర్సింగ్‌ విద్యను అభ్యసించే క్రమంలోనే వీరు శిక్షణలో భాగంగా వైద్యసేవల్లో పాల్గొంటారు. జిల్లా కేంద్రాల్లో నర్సింగ్‌ కళాశాలలు(Nursing Colleges in Telangana) నెలకొల్పడం వల్ల గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. మన కళాశాలల్లో నర్సింగ్‌ విద్య ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి దీటుగా ఉన్నాయి."

- డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, మహబూబ్‌నగర్‌ వైద్యకళాశాల, సంచాలకులు.

ABOUT THE AUTHOR

...view details