తెలంగాణ

telangana

మునుగోడు ఉపఎన్నిక.. ప్రచార జోరు పెంచిన భాజపా, కాంగ్రెస్

By

Published : Oct 7, 2022, 8:19 AM IST

Updated : Oct 7, 2022, 10:11 AM IST

munugode
మునుగోడు

Munugode election congress, bjp focus: మునుగోడు ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌, భాజపా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితోపాటు ముఖ్యనాయకులు అంతా క్షేత్రస్థాయిలో ఉండి ప్రచారం నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. అటు ఓటర్లను జల్లెడ పట్టేందుకు కాషాయ దళం రంగం సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈనెల 14న నామినేషన్‌ వేయనుండగా... భాజపా అనధికార అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి ఈ సోమవారం నామినేష్‌ దాఖలు చేయనున్నారు.

Munugode election congress, bjp focus: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ మరింత ఉద్ధృతం చేయనుంది. అందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసింది. ప్రధానంగా నియోజక వర్గంలోని మొత్తం బూతులను ఒక్కో క్టస్టర్‌ పరిధిలోకి పదేసి లెక్కన 30 వరకు విభజన చేశారు. బూతు స్థాయిలో సమన్వయకర్తలను ఏర్పాటు చేయడంతోపాటు క్లస్టర్‌ స్థాయిలో ఇంఛార్జిలను, ప్రతి మండలానికి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు అటాచ్‌మెంట్‌ ఇంచార్జిలను నియమించారు. వీరు కాకుండా మండలాలకు, మున్సిపాలిటీలకు వేర్వేరుగా సీనియర్‌ నాయకులు ఇంచార్జిలుగా కొనసాగుతున్నారు.

మునుగోడు ఎన్నికపై కాంగ్రెస్​, భాజపా ఫోకస్​

వీరంతా కూడా రేపటి నుంచి 14వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఉండి ప్రచారం వేగవంతం చేయనున్నారు. అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పటికే 5 మండలాల్లో ఇంటింటి ప్రచారం పూర్తి చేయగా మరో రెండు మండలాలు చేయాల్సి ఉంది. పాల్వాయి స్రవంతి తరఫున ఈ నెల 11న రెండు సెట్లు నామినేషన్లు వేస్తారు. ఆ తరువాత 14న భారీ జనసమీకరణతో మరొకసారి నామినేషన్లు వేయనున్నారు.

ఇక మునుగోడులో భాజపా సైతం దూకుడు పెంచింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి... స్థానికంగానే ఉంటూ ప్రచారం చేస్తున్నారు. పలు పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలను భాజపాలో చేర్చుకుంటూ పార్టీని స్థానికంగా బలోపేతం చేస్తున్నారు. సోమవారం రాజగోపాల్‌రెడ్డి నామినేషన్‌ వేసే అవకాశం ఉందని భాజపా నేతలు పేర్కొన్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం జరగనుండగా... స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, మండల ఇంఛార్జ్‌లు, ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీల నేతలు హాజరుకానున్నారు. భాజపా జాతీయ కార్యదర్శి సునీల్‌ బన్సల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ కూడా పాల్గొని విజయమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 7, 2022, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details