చిన్నప్పుడు తప్పిపోయి, మరో కుటుంబంలో సభ్యురాలిగా ఎదిగినా ఆమెకు తన రక్తసంబంధీకులను కలుసుకోవాలనే కోరిక అలాగే ఉండిపోయింది. అమ్మానాన్నలు, అక్కలు, సోదరులు గుర్తొచ్చినప్పుడల్లా మౌనంగా విలపించేది. 45ఏళ్ల వయసులోనూ ఆమె తన పుట్టింటివారిని తలచుకొని కన్నీరు పెట్టుకోవడాన్ని చూసిన ఆమె అల్లుడు.. ఎలాగైనా తన అత్తను ఆమె కుటుంబానికి దగ్గర చేయాలని సంకల్పించారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా సామాజిక మాధ్యమాల ఆసరాతో వారి జాడ తెలుసుకున్నారు. దాదాపు 38 ఏళ్ల నాడు దూరమైన తమ తోబుట్టువు ఫోన్ ద్వారా మాట్లాడడం, అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో ఆమె సోదరులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. హుటాహుటిన ఆమెను చూసేందుకు రెక్కలు కట్టుకొని వచ్చేశారు. అంతే.. ముగ్గురి కళ్ల నుంచి ఆనందబాష్పాలు ధారకట్టాయి. ఆంధ్రప్రదేశ్లోని అమృతలూరు మండలం యలవర్రులో శుక్రవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది.
వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం నెలివెడి గ్రామానికి చెందిన క్యాసని నాగన్న, తారకమ్మ దంపతుల మూడో సంతానమైన మంగమ్మ తన ఏడో ఏట తండ్రితో కలిసి హైదరాబాద్కు వచ్చింది. ఆమె సరిగ్గా చదవడం లేదని.. స్నేహితుడి దగ్గర ఉంచితేనైనా బాగా చదువుకుంటుందని అక్కడే వదిలివెళ్లిపోయాడు తండ్రి. మూడు రోజులు గడవకముందే అమ్మపై బెంగతో ఎవరికీ చెప్పకుండా తమ ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చింది. అలా రోడ్లపై తిరుగుతున్న ఆమెను చూసిన ఓ వృద్ధుడు తల్లి వద్దకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి, ఆమెకు అల్పాహారమిచ్చి రైలులో విజయవాడ తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపని తెలుగు బాప్టిస్టు చర్చి వద్దకు తీసుకొచ్చాడు. తన మాట వినడంలేదని పాపను ఆ వృద్ధుడు కొడుతుండడంతో అక్కడివారు ప్రశ్నించి, ఆ చిన్నారిని ఎత్తుకొచ్చాడని నిర్ధారించుకొని అతన్ని వెళ్లగొట్టారు.