తెలంగాణ

telangana

INS visakhapatnam: రేపు నౌకదళం అమ్ముల పొదిలోకి.. ఐఎన్​ఎస్​ విశాఖ

By

Published : Nov 20, 2021, 11:02 PM IST

తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంగా దేశంలోనే అతిపెద్ద రక్షణ దళ కమాండ్​కు కేంద్రంగా.. ఏపీలోని విశాఖకు ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ నగరం పేరుమీద ఒక అత్యాధునిక యుద్ధ నౌక (INS visakhapatnam)నిర్మాణానికి తొమ్మిదేళ్ల క్రితమే అడుగు పడింది. దేశీయంగా తయారైన ఈ యుద్ధ నౌక.. అత్మనిర్భర్ భారత్​కు ఒక తార్కాణంగా.. నౌకా నిర్మాణ సత్తాను మరో మారు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా రూపొందింది. ముంబైలోని నౌకానిర్మాణ సంస్ధలో దీనిని తయారు చేశారు. భారత నౌకాదళంలోకి ఈ అత్యాధునిక యుద్ధ నౌక చేరుతున్న సందర్భంగా "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం.

INS visakhapatnam launched  indian navy
INS visakhapatnam

నౌకదళం అమ్ముల పొదిలోకి.. ఐఎన్​ఎస్​ విశాఖ

ద్వీపకల్ప భారత దేశానికి నౌకా యానం ద్వారా వాణిజ్య సంబంధాలు మెరుగుపడటం ఒక అభివృద్ధికి​ కారణమైతే, నౌకాదళం (indian navy) ద్వారా మన జలాలను రక్షణ అవసరాలకు వినియోగించుకోవడం, అంతర్జాతీయంగా పలు దేశాల నౌకాదళాలతో కలిసి రక్షణ అంశాలపై పరస్పరం కలిసి పనిచేయడం వంటి ప్రథమ కర్తవ్యాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చేందుకు త్రివిధ దళాలలో నౌకాదళానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పదాతి, వాయు సేనలతో సమన్వయం చేసుకుంటూ, రక్షణ అవసరాల కోసం ఎప్పటికప్పుడు కొత్త యుద్ధ నౌకలను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు 15 బీ నౌకల తయారీని ఆరంభించింది. ముంబైలోని నౌకానిర్మాణ సంస్థలో ఈ నౌకల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం(INS visakhapatnam), ఐఎన్ఎస్ మర్మగోవా, ఐఎన్ఎస్ ఇంఫాల్, ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌకలను నిర్మిస్తున్నారు. 2012లో ఈ నౌకల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ సీరిస్ లో తొలి నౌకకు ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి 2015లో నిర్మాణాన్ని ప్రారంభించారు.

ప్రాజెక్టు 15 బీ సిరీస్​తో అత్యాధునిక యుద్ధనౌక నిర్మాణం..
ప్రాజెక్టు 15 బీ సిరీస్​(project 15B Series)లో ఈ అత్యాధునిక యుద్ధ నౌక నిర్మాణం జరిగింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో భారత నౌకాదళం అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ నౌకను ఇండియన్ నేవీ రూపకల్పన(డిజైన్) చేసింది. 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువు ఉన్న ఈ యుద్ధ నౌక.. 30 నాటికల్ మైళ్ల గరిష్ఠ వేగంతో నీలి జలాలపై పరుగులు తీస్తుంది. యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే విధంగా.. ఆయుధ సామగ్రిని అమర్చేందుకు వీలుగా విశాలమైన డెక్ ఉంటుంది. ఇందులో ఎప్పుడూ రెండు యుద్ధ హెలీకాప్టర్‌లు దిగేందుకు అనువుగా నిర్మాణం చేపట్టారు.

ఈ నౌక ప్రత్యేకతలలో..
యుద్ధ సామగ్రి శత్రు రాడార్​ల కంటికి చిక్కకుండా, రాడార్​లకు అందకుండా, భద్రపర్చడం ఒకటైతే.. అత్యాధునిక రెండు రాడార్ లు నిరంతరం పరిసరాలను పరిశీలిస్తూ యుద్ధంలో పాల్గోనేందుకు వీలుగా అన్ని రకాల సమాచార వ్యవస్ధలు పనిచేసేట్టుగా(ins visakhapatnam design) అమర్చారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఈ నౌకకు ఒక హంగు అయితే, నౌక అన్ని వైపులా ఫిరంగులు, ఎకె 630 గన్ లు, 76 ఎంఎం మీడియం రేంజ్ గన్‌లు, క్లోజ్ రేంజ్ గన్‌లు, అత్యంత బరువైన టార్పెడోలు, ఎయిర్ సర్వేవలెన్స్ రాడార్‌లు, బౌ మౌంటెడ్ హంసా ఎనర్జీ సోనార్‌లు, శక్తి ఎలక్ట్రానిక్స్ సర్వెవలెన్స్ సిస్టమ్స్, కవచ్ కార్ప్, యాంటీ టార్పెడో సిస్టమ్స్‌ను అమర్చారు. నౌక నుంచి గాలిలోకి, నీటిలోకి, మరో నౌక పైకి కదులుతున్న లక్ష్యాలను చేధించే విధంగా.. మిస్సైళ్ల ప్రయోగం శత్రు భయంకరంగా చేసేందుకు ఏర్పాటు చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ నౌక ముందు భాగంలో దేశీయంగా తయారైన బ్రహ్మోస్ క్షిపణి అమర్చి ఉంచారు.

రివర్స్ బుల్ గ్యాస్ టర్బైన్ల అమరిక..
కోగాగ్ ప్రొపల్షన్ విధానంలో రివర్స్ బుల్ గ్యాస్ టర్బైన్లు ఈ నౌకకు అమర్చారు. సొంతంగా 4.6 మెగావాట్ల విద్యుత్తును ఈ నౌక ఉత్పత్తి చేసుకుంటుంది. సమీకృత కార్యకలాపాలను నిర్వహించే రెండు భారీ హెలీకాప్టర్లను కూడా ఈ నౌక మోసుకెళ్లే విధంగా తయారు చేశారు.

విశాఖ పేరు పెట్టటం వెనక ఆసక్తికర అంశాలు
ఈ యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరును పెట్టడం వెనుక ఆసక్తికరమైన అంశాలే ఉన్నాయి. తూర్పు నౌకాదళానికి ప్రధాన స్థావరంగా విశాఖ రూపుదిద్దుకోవడం, 18వ శతాబ్దంలోనే ఇక్కడి లైట్ హౌస్, తర్వాత 1960లో ప్రస్తుతం ఉన్న లైట్ హౌస్ నిర్మాణం, డాల్ఫిన్స్ నోస్ కొండ, పాక్ యుద్ధంలో 1971లో ఈ స్థావరానికి దగ్గరలోనే పాక్ సబ్‌మెరైన్ ఘాజీని భారత నౌకాదళం ముంచేయడం.. అది యుద్ధంలో విజయానికి మలుపు తిప్పడం వంటివి అన్ని ఇందులో కీలకమయ్యాయి. ప్రతి నౌకకు ఒక ప్రత్యేక మైన లోగోను రూపొందించడం కూడా సంప్రదాయంగా వస్తోంది. ఐఎన్ఎస్ విశాఖకు సంబంధించి లైట్ హౌస్, డాల్ఫిన్ కొండ, నీలిసముద్రపు అలలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారిక జంతువు జింక కొమ్ములు.. విక్టరీ ఆకారంలో ఉండే విధంగా రూపొందించారు. విజయనక్షత్రాలకు గుర్తుగా ఇందులో నీలి ఆకాశంలో నక్షత్రాన్ని కూడా తీర్చిదిద్దారు.

సంస్కృతంలోని యశో లాభస్య:(attain glory), అన్నది ఈ నౌకకు లక్ష్యంగా నిర్దేశించారు. దీనిని సాధించేందుకు అప్రమత్తంగా(vigilant), హింసాత్మకమైన(violent), విజేత(victorious) అన్నవాటిని టాగ్ లైన్‌గా ఉంచారు. కెప్టెన్ బీరేంద్ర ఎస్.బెయిన్స్ కమాండింగ్ అధికారిగా వ్యవహరించే ఈ నౌకలో 41 మంది సిబ్బంది ఉంటారు. దీనిని నౌకాదళంలోకి ప్రవేశపెట్టి జాతికి అంకితం చేసే కార్యక్రమం.. రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆధ్వర్యంలో నవంబర్ 21న ముంబైలో జరగనుంది. భారత నౌకాదళంలోని పశ్చిమ నౌకా కమాండ్​లో ప్రస్తుతం ఇది కొలువుదీరనుంది.

ఇదీ చదవండి:CM KCR on Three Farmers Law : సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం... వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం

ABOUT THE AUTHOR

...view details