తెలంగాణ

telangana

Mahesh Bank Server Hacking Case : 'మహేశ్‌బ్యాంక్‌ నిర్లక్ష్యం వల్లే సర్వర్ హ్యాక్ అయింది'

By

Published : Mar 30, 2022, 1:52 PM IST

Updated : Mar 30, 2022, 3:45 PM IST

Mahesh Bank Server Hacking Case : సైబర్‌ మోసాల నుంచి రక్షణ కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్లే మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్‌ను సులువుగా హ్యాక్‌ చేశారని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని తెలుసుకోవడానికి చాలా శ్రమించామని.... దర్యాప్తు కోసమే రూ.58 లక్షలు ఖర్చైనట్లు తెలిపారు. ఈ హ్యాకింగ్ కేసులో మొత్తం 23 మందిని అరెస్ట్‌ చేశామని... ఇందులో 4 నైజీరియన్లు ఉన్నారని చెప్పారు. ప్రధాన హ్యాకర్‌ను తెలుసుకోవడానికి ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టంచేశారు.

Mahesh Bank Server Hacking Case
Mahesh Bank Server Hacking Case

'మహేశ్‌బ్యాంక్‌ నిర్లక్ష్యం వల్లే సర్వర్ హ్యాక్ అయింది'

Mahesh Bank Server Hacking Case : మహేశ్‌ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌ చేసేందుకు సైబర్ నేరగాళ్లు పక్కా పథకం ప్రకారం కుట్ర పన్నారని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు ఫిషింగ్ మెయిల్స్ పంపించి... వాటి ద్వారా సర్వర్‌లోకి చొరబడ్డారని వివరించారు. బ్యాంకు సిబ్బందికి నవంబర్‌లో 200 ఫిషింగ్ మెయిల్స్ పంపించారన్న సీపీ.. వారిలో ఇద్దరు ఫిషింగ్ మెయిల్స్‌ను తెరవడంతో హ్యాక్‌ అయిందని అన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని... ఈ కేసు దర్యాప్తునకు ఇప్పటికే రూ.58 లక్షలు ఖర్చయ్యాయని తెలిపారు.

అసలేం జరిగింది? : మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో కీలక నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సర్వర్​ను హ్యాక్ చేసి 12 కోట్ల ఇతర ఖాతాలకు మళ్లించిన ఘటనలో ప్రధాన సూత్రధారిని పోలీసులు గుర్తించారు. జనవరి 23వ తేదీన మహేశ్ బ్యాంక్ సర్వర్​ను హ్యాక్ చేసిన నిందితుడు పన్నెండు కోట్ల రూపాయలను.. నాలుగు ఖాతాల్లోకి మళ్లించాడు. ఆ తర్వాత అప్పటికే సిద్ధం చేసుకున్న మరో 128 ఖాతాలకు 12 కోట్లు మళ్లించాడు. సర్వర్​లో నుంచి నగదు అక్రమంగా బదిలీ అయిన విషయం గమనించిన బ్యాంకు ప్రతినిధులు.. అప్రమత్తమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు బదిలీ అయిన విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సదరు బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లడంతో మూడు కోట్ల రూపాయలను బదిలీ కాకుండా నిలిపి వేయగలిగారు. 9 కోట్ల రూపాయలు మాత్రం సైబర్ నేరగాళ్లు పలు ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్నారు.

"మహేశ్‌బ్యాంక్ సర్వర్‌లో లోపాలు ఉన్నాయి. వాటిని అసరా చేసుకొని నగదు బదిలీ చేసుకున్నారు. సర్వర్‌ను పకడ్బందీగా నిర్వహించడంలో మహేశ్‌బ్యాంక్ విఫలమైంది. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్‌కు 2 నెలల ముందే ఖాతాలు తెరిచారు. జనవరి 23న సర్వర్ హ్యాక్ చేసి 4 ఖాతాల్లోకి నగదు నిల్వలను పెంచేశారు. సదరు ఖాతాల నుంచి పలు బ్యాంక్‌లలోని 115 ఖాతాలకు బదిలీ చేశారు."

- సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ

Mahesh Bank Server Hacking Case Updates : 115 ఖాతాల నుంచి మరో 398 ఖాతాలకు నగదు బదిలీ చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీలు ఉపయోగించారు. ఒక ఐపీ స్విట్జర్లాండ్, మరొకటి కెనడాలో చూపిస్తోంది. ఈ హ్యాకింగ్ కేసులో మొత్తం 23 మందిని అరెస్టు చేశాం. అరెస్టయినవారిలో నలుగురు నైజీరియన్లు ఉన్నారు. స్టీఫెన్ ఒర్జి ప్రధాన హ్యాకర్‌కు సహకరించాడు. ప్రధాన హ్యాకర్లు నైజీరియాలో ఉన్నారు. ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేస్తామని తెలిపారు.

మహేశ్‌బ్యాంక్ కేసులో దర్యాప్తు కోసం రూ.58 లక్షలు ఖర్చుచేశాంమని... ఫైర్‌వాల్స్ లేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. ముంబయికి చెందిన ఇన్‌ఫ్రా సాప్ట్ కంపెనీకి నోటీసు ఇస్తామని సీపీ తెలిపారు. ఈ కేసులో కనీస సమాచారం కూడా ఇన్‌ఫ్రా సంస్థ ఇవ్వడం లేదని వారికి నోటీసులు ఇచ్చామని త్వరలోనే విచారిస్తామని చెప్పారు. ప్రధాన హ్యాకర్ నైజీరియా లేదా బ్రిటన్‌లో ఉండొచ్చని భావిస్తున్నారు. మహేశ్‌బ్యాంక్‌ ప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే తప్పిదం జరిగిందని అన్నారు. మహేశ్‌బ్యాంక్‌ ప్రతినిధులను కూడా విచారిస్తామని పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతో వ్యాపారం చేసే బ్యాంకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు.

Last Updated : Mar 30, 2022, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details